కామారెడ్డి, బతుకమ్మ : వృద్ధురాలుని హత్య చేసిన వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేశ్ చంద్ర తెలిపారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలను వెల్లడించారు. జిల్లా పరిధిలోని నసురుల్లాబాద్ మండలం అంకోల్ తండాకు చెందిన గుగులోత్ రాధిబాయి అనే వృద్ధురాలు దీపావళి రోజు హత్యకు గురైందనే ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. వృద్ధురాలి ఇంటి ఎదురుగా ఉంటున్న మోగావత్ సవాయి సింగ్ అనే వ్యక్తి హత్య కేసినట్లు గుర్తించారు. మద్యం తాగడం, పేకాట ఆడటం, ఇతర జల్సాలకు అలవాటు పడిన సవాయి సింగ్ దీపావళి రోజు వరుసకు నానమ్మ అయిన రాధిబాయి ఆశీర్వాదం తీసుకోవడానికి ఇంట్లోకి వెళ్లాడు. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో వృద్ధురాలి చేతులకు ఉన్న రెండు కడియాలు దొంగిలించి వృద్ధురాలు తలను నేలకేసి కొట్టి గొంతు పిసికి హత్య చేశాడు. అక్కడి నుంచి పారిపోయే క్రమంలో బయట ఉన్న మరో మహిళకు గాయం చేశాడు. బుధవారం కడియాలు అమ్మడానికి వెళుతుండగా పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుని నుంచి కడియాలు స్వాధీనం చేసుకుని రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు.

