నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : దీర్ఘకాలంగా పెండింగ్ లోనున్న రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 29న హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ వద్ద పెన్షనర్ల మహా ధర్నాను నిర్వహిస్తున్నట్లు తెలంగాణ ఆల్ పెన్షనర్స్అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు కే రామ్మోహన్రావు తెలిపారు. గురువారం నిజామాబాదులోని పెన్షనర్స్ భవన్లో జరిగిన జిల్లా కార్యవర్గ సమావేశంలో అత్యధిక సంఖ్యలో పెన్షనర్లు హాజరుకావాలని కమిటీ తీర్మానం చేసింది. ప్రధానంగా గత సంవత్సరం పైగా రిటైర్ అయినటువంటి ఉద్యోగులకు ఎలాంటి పెన్షనరీ బెనిఫిట్ లు విడుదల చేయలేదని, దీని మూలంగా పెన్షనర్లు అనేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. పెండింగ్లో ఉన్న డిఏ లను విడుదల చేయాలని, పిఆర్సి నీ 60 శాతంతో ఫిట్మెంట్ను ఇవ్వాలని, పెండింగ్ లోనున్న మెడికల్ రీయంబర్స్మెంట్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని, హెల్త్ స్కీమ్ ను పటిష్ట పరిచి నగదు రహిత వైద్యాన్ని అన్ని ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రుల్లో అనుమతించాలని డిమాండ్ చేశారు. ఈ సమస్యల పరిష్కారం కోసమే మహా ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి మదన్మోహన్, డివిజన్ అధ్యక్షులు హనుమాన్లు ఉపాధ్యక్షులు నరేందర్, హమీదుద్దీన్, లావు వీరయ్య, దీన సుజనా, లక్ష్మీనారాయణ, లింగయ్య, బాబా గౌడ్, భట్టి గంగాధర్, ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.
