నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :
జనవరి 23,24,25 తేదీల్లో ఖమ్మం పట్టణంలో జరగనున్న PDSU 23వ రాష్ట్ర మహాసభల గోడపత్రికలను గిరిరాజ్ ప్రభుత్వ కళాశాలలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పిడిఎస్ యు నగర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎండీ. నసీర్, ఆర్. వినోద్ కుమార్ లు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో విద్యా రంగం సంక్షోభంలో ఉందని, ప్రభుత్వ పాఠశాలల్లో, కళాశాలల్లో మౌలిక సదుపాయాలు లేవన్నారు. సంక్షేమ వసతి గృహాలలో చదువుకునే విద్యార్థులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారనీ, ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం సక్రమంగా అమలు కావట్లేదని, ప్రభుత్వం మధ్యాహ్నం భోజనం కోసం ఒక్కో విద్యార్థి పై వెచ్చించే డైట్ చార్జీలు సరిపోవట్లేదన్నారు. తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగంలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో పాఠశాల విద్యను గాడిలో పెట్టేందుకు ఎంఈఓ, డీఈవో, డిప్యూటీ డీఈఓ రెగ్యులర్ పోస్టులను భర్తీ చేయాలన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగ సమస్యల పరిష్కారానికి తగు చొరవ చూపాలన్నారు. 23వ రాష్ట్ర మహాసభలలో రాష్ట్రంలో విద్యారంగం ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై చర్చించనున్నట్లు, పలు తీర్మానాలు చేసి ఆయా సమస్యలపై భవిష్యత్తులో పోరాటాలు రూపకల్పన చేయనున్నట్లు తెలిపారు. 23వ తేదీన వేలాదిమంది విద్యార్థులతో భారీ ప్రదర్శన, బహిరంగ సభ ఉంటుందనీ విద్యార్థులు వేలాదిగా హాజరై జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్ యూ నగర సహాయ కార్యదర్శి సృజన్, కళాశాల నాయకులు కిరణ్, ధీరజ్, రఘు, అతిఫ్, ముదసీర్, సౌమ్య, రమ్య, సాయి ప్రియ, ప్రియాంక తదితరులు పాల్గొన్నారు.