నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: నగరంలోని న్యూ అంబేద్కర్ భవన్ లో ఈనెల 17న జాతీయ పెన్షనర్స్ డేను నిర్వహించనున్నట్లు తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కే రామ్మోహన్ రావు తెలిపారు. అసోసియేషన్ కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పెన్షన్ అనేది ప్రాథమిక హక్కుగా గుర్తించిన డిసెంబర్ 17ను దేశవ్యాప్తంగా పండుగలా జరుపుకుంటున్నట్లు ఆయన తెలిపారు. అయితే ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాల కారణంగా పెన్షన్ అనేది ప్రమాదంలో పడిందని, దానిని కాపాడుకునేందుకు కృషి చేస్తామన్నారు. పెన్షనర్స్ డే కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా బోధన్ ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, అడిషనల్ కలెక్టర్ ఎస్ కిరణ్ కుమార్, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, జాతీయ పెన్షనర్స్ యూనియన్ నాయకురాలు సంయుక్త, గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతరెడ్డి రాజారెడ్డి హాజరవుతారని తెలిపారు. సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్. మదన్ మోహన్, నిజామాబాద్ డివిజన్ కార్యదర్శి ప్రసాద్ రావు, జిల్లా నాయకులు హమీదుద్దీన్, రాధా కిషన్, ప్రసాద్, సిర్ప లింగయ్య, డి లక్ష్మీనారాయణ, మధు మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు.
