- వంద ఎకరాల్లో ఆక్రమణలకు యత్నం
- చెట్లను నరికి పోడుకు సిద్ధం చేసిన వైనం
- ఆలస్యంగా గుర్తించిన అధికారులు
నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ రూరల్ మండలంలోని లింగితాండ శివారులోని అటవి ప్రాంతం అన్యక్రాంతమైంది. అటవీ శాఖాధికారుల నిర్లక్ష్యం స్థానిక గ్రామాల ప్రజలు పోడుకు సిద్దమయ్యారు. గత జూన్ మాసం నుంచి లింగితాండ శివారులోని అటవి ప్రాంతంలో పోడు కోసం చెట్ల నరికివేత కొనసాగుతుంది. స్థానిక ముత్తకుంట శివారుతో పాటు లింగితాండ శివారులో ఉన్న అటవి ప్రాంతంలో దాదాపు వంద ఎకరాల మేర పోడుకు సిద్దం చేశారు. స్థానికంగా ఉన్న గ్రామస్తులే ఒక్కరికి ఐదు ఎకరాల చొప్పున అని చెట్లను నరికివేసి చదును చేసే కార్యక్రమాన్ని చేపట్టారు. ఇటీవల వర్షాకాలంలోనూ పచ్చగా ఉండాల్సిన చెట్లను మొదళ్ళను నరికివేశారు. ఆయా శివారు గ్రామాల ప్రజలు ఈ వ్యవహరాన్ని గుట్టుచప్పుడు కాకుండా కొనసాగించారు.

నిజామాబాద్ నార్త్ రేంజ్ అటవీ శాఖ పరిధిలోని లింగితాండలో వంద ఎకరాల అటవి భూమి అన్యక్రాంతమౌతుంటే అటవీ శాఖాధికారులు చోద్యం చూస్తున్నారు. జూన్ మాసంలో ప్రారంభమైన పోడు పనులు నిరంతరంగా జరుగుతుంటే సంబంధిత సెక్షన్ పరిధిలోని అటవీ అధికారులు ఆ సెక్షన్ ఆఫీసర్ తో పాటు బీట్ ఆఫీసర్లు ఏం చేస్తున్నారన్న ప్రశ్న తలెత్తుతుంది. స్థానికంగా అటవీ ప్రాంతం అన్యక్రాంతం కాకూడదని నిత్యం నిఘా ఉంచే అటవీ శాఖాధికారులకు కాసులను ఇచ్చి మేనేజ్ చేశారని వాదనలున్నాయి. ఇదే విషయం తెలిసి స్థానిక రెండు గ్రాముల ప్రజల తాము పోడు కోసం సిద్దమయ్యారు. అయితే అటవీ శాఖ భూమి దాదాపు 80 ఎకరాల వరకు చెట్లను నరికి చదును చేస్తుండగా గుర్తించకపోవడం వెనుక మతలబు ఉందని చెబుతున్నారు. గతంలో పోడు పట్టాలు పంపిణీ చేసిన వ్యవహరాలు ఉండగా దానిని ఆసరాగా చేసుకుని అటవీ శాఖాధికారులకు అమ్యామ్యాలు ఇచ్చి కబ్జాలో ఉన్నామని పత్రాలు ఇవ్వాలని బేరసారాలు సాగినట్లు సమాచారం.

నిజామాబాద్ నార్త్ రేంజ్ పరిధిలోని లింగితాండలో జరుగుతున్న అటవీ ఆక్రమణల గురించి గడిచిన నెలలో నార్త్ రేంజ్ అధికారులు గుర్తించి పలువురిని పట్టుకుని రూరల్ పోలీసులకు అప్పగించారు. రూరల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా 12 మందిపై కేసులకు సిఫారసు చేసినట్లు తెలిసింది. అయితే కొందరు గ్రామస్తులు తమ ప్రమేయం లేకున్నా అటవీ శాఖాధికారులు నోటీసులు ఇచ్చారని వాపోతున్నారు. లింగితాండ కాకుండా పక్కనే ఉన్న ముత్తకుంట, కుర్నాపల్లి గ్రామాలలో అటవీ భూముల కబ్జా ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. ఇటీవల ఈ విషయం తెలిసిన వారు లింగితాండ అటవీ ప్రాంతంలోకి వెళ్లకుండా భయబ్రాంతులకు గురి చేసే పనులు జరుగుతున్నాయి. అటవీ భూమి, అటవీ సంపద అన్యక్రాంతం అవుతుంటే వారి వెనుక అధికార పార్టీ నాయకులున్నారని, అమ్యామ్యాలు ఇచ్చారని వారిపై కఠిన చర్యలకు సిద్దం కావడం లేదని గ్రామస్తులు బహిరంగంగా ఆరోపిస్తున్నారు. లింగితాండ శివారులో జరిగిన అటవీ భూముల అక్రమణ విషయంపై బతుకమ్మ ఎఫ్ ఆర్ వో సంజయ్ గౌడ్ ను వివరణ కోరగా రెండు హెక్టార్ లలో ఆక్రమణలకు యత్నం జరిగాయని తెలిపారు. అడ్డుకుని రూరల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశామన్నారు. అటవీ భూముల్లోకి వెళ్లకుండా కందకాలు తవ్వించినట్లు తెలిపారు.

