- అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ
హైదరాబాద్, బతుకమ్మ : అసెంబ్లీ సాక్షిగా కాంగ్రెస్ పార్టీ గవర్నర్ చేత అసత్యాలు పలికించిందని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ మండిపడ్డారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగంపై బుధవారం నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. “కలలు కనండి, వాటిని సాకారం చేసుకోండి” అన్న అబ్దుల్ కలామ్ మాటలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి మొద్దు నిద్రలో ఉంటు “కలలు కనండి, కానీ మెలకువలో ఉండొద్దు” అనేలా పాలన సాగుతోందని విమర్శించారు. అసెంబ్లీ సాక్షిగా గవర్నర్ చేత పచ్చి అబద్ధాలు ప్రస్థావించేలా చేయడం ఖండించదగిన చర్య అని పేర్కొన్నారు. ప్రజలందరికీ మోసం, రైతులు, మహిళలు, యువత మోసపోయారు.. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం గొప్పలు చెప్పుకోవడమే మిగిలిందని దుయ్యబట్టారు. ఎకరానికి రూ.15,000 హామీ ఇచ్చి, కేవలం ₹12,000 చెప్పడం.. ఇంకా వేల సంఖ్యలో రైతులు ఎదురుచూస్తున్నారని అన్నారు. రైతు కూలీలకు రూ.12,000 ఇచ్చామంటున్నారని, నిజంగా ఎంత మందికి ఇచ్చారని ప్రశ్నించారు.
