. . . ప్రగతి శీల మహిళా సంఘం ప్రధాన కార్యదర్శి గొంట్యాల సంజన
. . . మార్చి 8న నిర్వహించే అంతర్జాతీయ మహిళా దినోత్సవ వాల్ పోస్టర్ల ఆవిష్కరణ
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :
అంతర్జాతీయ మహిళా దినోత్సవం స్ఫూర్తితో మహిళల హక్కుల కోసం ఉద్యమాలు నిర్మిద్దామని ప్రగతిశీల మహిళా సంఘం నగర ప్రధాన కార్యదర్శి గొంట్యాల సంజన అన్నారు. ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు శ్రామిక మహిళల ఉపాధి పై దాడికి వ్యతిరేకంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మార్చి 8న నగరంలోని నీలం రామచంద్రయ్య భవన్ లో నిర్వహిస్తున్నట్టు ప్రగతిశీల మహిళా సంఘం నగర అధ్యక్ష, కార్యదర్శులు నీలం లక్ష్మీ, గొంట్యాల సంజన తెలిపారు. ప్రగతిశీల మహిళా సంఘం నగర కమిటీ ఆధ్వర్యంలో బుధవారం స్థానిక పోచమ్మ గల్లీలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం వాల్ పోస్టర్ లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సంజన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకానికి తూట్లు పొడిచి నూతన పథకం తేవడం ద్వారా పని కల్పించే బాధ్యత నుండి తప్పుకోవాలని నిర్ణయించుకుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం తన వాటాను 60 శాతానికి తగ్గించుకొని పేద మహిళలకు పని కల్పించకుండా చట్టాన్ని తయారు చేసిందనన్నారు. మహిళల ఉపాధి అవకాశాలను దెబ్బతీసే నూతన పథకాన్ని రద్దు చేసి పాత పథకాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలలో హామీ ఇచ్చిన మహిళల జీవన భృతిని, ఉద్యోగాల కల్పన, నిరుద్యోగ భృతి మిగతా హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పిఓడబ్ల్యూ నాయకులు జమున, రాధా, నర్సు బాయి, కళావతి, పోచమ్మ గల్లీ కాలనీవాసులు పాల్గొన్నారు.
