నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ: మతోన్మాదం, విభజన రాజకీయాలకు వ్యతిరేకంగా వామపక్ష పార్టీల ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో ఈనెల 17వ తేదీన జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో సదస్సు నిర్వహించనున్నట్లు నాయకులు తెలిపారు. నగరంలోని ఎన్ఆర్ భవన్ లో మంగళవారం విలేకరులతో మాట్లాడారు. మోదీ ప్రభుత్వం గత పదేళ్లుగా మతోన్మాదాన్ని పెంచిపోషిస్తోందని విమర్శించారు. ప్రజల దృష్టి మరల్చి అనేక ప్రజా వ్యతిరేక విధానాలను అమలు చేస్తున్నదన్నారు. ప్రభుత్వ సంస్థలను కార్పొరేట్ కంపెనీలకు అమ్మేస్తోందని ఆరోపించారు. ఉద్యోగ అవకాశాలు కల్పించకుండా, ఉన్న ఉద్యోగాలను ఊడ గొడుతున్నదన్నారు. విద్య, వైద్య రంగాలపై తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తోందన్నారు. కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక చట్టాలను తీసుకొచ్చిందన్నారు. జిల్లాలోని ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు, లౌకికవాదులు ఈ సదస్సును జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. విలేకరుల సమావేశంలో సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ (ప్రజాప్రంథా) జిల్లా కార్యదర్శి వనమాల కృష్ణ, సీపీఎం జిల్లా కార్యదర్శి ఏ.రమేష్ బాబు, సీపీఐ(ఎం.ఎల్) న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఏ.పాపయ్య, ఎంసీపీఐ(యూ) జిల్లా కార్యదర్శి శ్రీనివాస్, . ఎం.నరేందర్, ఎం.వెంకన్న, ఎం.సుధాకర్, సీపీఎం నాయకులు రాములు, పీడీఎస్ యూ జిల్లా ప్రధాన కార్యదర్శి కే.గణేశ్, ఐఎఫ్టీయూ నాయకులు సాయన్న తదితరులు పాల్గొన్నారు.