బాన్సువాడ , బతుకమ్మ:
కామారెడ్డి జిల్లా నసురుల్లాబాద్ మండలంలోని దుర్కి గ్రామంలోని తెలంగాణ వెల్ఫేర్ రెసిడెన్షియల్ కళాశాల లో పార్ట్ టైం కెమిస్ట్రీ లెక్చరర్ గా పనిచేస్తున్న స్వప్న అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఈ సంఘటన శనివారం ఉదయం వెలుగు చూసింది. నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలం గాండ్లపేట గ్రామానికి చెందిన స్వప్న గత మూడు సంవత్సరాలుగా తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ లో కెమిస్ట్రీ పార్ట్ టైం లెక్చరర్ గా పనిచేస్తుంది. శుక్రవారం కోదాడలో టెట్ ఎగ్జామ్ రాసి రాత్రి కళాశాలలో నైట్ డ్యూటీకి హాజరైంది. రాత్రి పిల్లలతో కలిసి పడుకుని ప్రొద్దున లేవకపోవడంతో విద్యార్థినులు ప్రిన్సిపాల్ కు సమాచారం ఇవ్వడంతో స్వప్నను కళాశాల సిబ్బంది హుటా హుటిన ఆసుపత్రికి తరలించారు. నిద్రలోనే స్వప్న మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. స్వప్న మృతి పట్ల రెసిడెన్షియల్ పాఠశాల కళాశాల ప్రిన్సిపాల్ తో పాటు లెక్చరర్లు విద్యార్థినిలు కన్నీటి పర్యంతమయ్యారు. అందరితో కలిసిమెలిసి ఉండేదని హఠాత్తుగా మరణించడం బాధాకరమని తోటి లెక్చరర్ పేర్కొన్నారు.
