హైదరాబాద్, బతుకమ్మ: ఇందిరమ్మ ఇళ్ల పథకం మొబైల్ యాప్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మంత్రులతో కలిసి గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ఇందిరా గాంధీ దశాబ్దాల క్రితమే పేదల కోసం ఇళ్లు, భూ పంపిణీ పథకాలను అమలు చేశారని గుర్తు చేశారు. దేశంలో ఇందిరమ్మ పేరుతో కాలనీ లేని ఊరు లేదన్నారు. రూ.10వేల ఆర్థిక సాయంతో ప్రారంభమైన ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రస్తుతం రూ.5లక్షలకు చేరుకుందన్నారు. అర్హులకు సొంతిటింని ఇవ్వాలనే ఉద్దేశంతో తొలిదశలో 4.50లక్షల ఇళ్ల నిర్మాణానికి అనుమతులు ఇచ్చినట్లు సీఎం వెల్లడించారు. పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ, కే కేశవరావు తదితరులు పాల్గొన్నారు.

