. . . భూ భారతి – భూముల రీ సర్వే అవగాహన సదస్సులో ఎమ్మెల్యే మదన్ మోహన్
గాంధారి, బతుకమ్మ :
భూముల విషయంలో ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అధికారుల తో సమన్వయం చేసుకొని తమ భూములకు రీ సర్వే చేయించుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత అటవీ శాఖ అధికారులు, రైతుల మధ్య ఉన్న భూముల గందరగోళం శాశ్వతంగా తొలగిపోతుందని ఎమ్మెల్యే మదన్ మోహన్ తెలిపారు. గాంధారి మండలంలోని సీతాయిపల్లి గ్రామంలో బుధవారం నిర్వహించిన భూ భారతి – భూముల రీ సర్వే అవగాహన సదస్సు కార్యక్రమంలో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలో భూములకు సంబంధించిన అనేక సమస్యలు ఉన్నాయని, ప్రతిరోజూ ఎంతోమంది ప్రజలు తమ భూ సమస్యల పరిష్కారం కోసం తన వద్దకు వస్తున్నారని తెలిపారు. ఈ సమస్యలకు శాశ్వత పరిష్కారం కల్పించాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తో ప్రత్యేకంగా మాట్లాడి ఎల్లారెడ్డి నియోజకవర్గంలో భూ భారతి పైలట్ ప్రాజెక్ట్ అమలు చేయాలని ఒప్పించినట్లు తెలిపారు. అలాగే మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్వయంగా ఎల్లారెడ్డి నియోజకవర్గానికి వచ్చి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన విషయాన్ని ఎమ్మెల్యే గుర్తు చేశారు. గాంధారి మండలంలోని చాలా గ్రామాలు అటవీ ప్రాంతాలకు ఆనుకుని ఉండటంతో భూముల విషయంలో తరచూ వివాదాలు వస్తున్నాయని ఎమ్మెల్యే అన్నారు. కొన్నిసార్లు అటవీ శాఖ అధికారులు వచ్చి భూములకు హద్దులు వేస్తుంటే, రైతులు ఈ భూమిని మేము 30-40 ఏళ్లుగా సాగు చేస్తున్నాం అంటూ తన వద్దకు వస్తున్నారని తెలిపారు. ఇలాంటి సమస్యలకు పూర్తిస్థాయి పరిష్కారం చూపించడానికే భూ భారతి – భూముల రీ సర్వే కార్యక్రమం చేపట్టినట్లు పేర్కొన్నారు.

