నిజామాబద్ క్రైం, బతుకమ్మ :
నిర్దేశిత వ్యాపార సమయం దాటిన తర్వాత కూడా వ్యాపారం నిర్వహిస్తున్న వ్యాపారస్తులకు శిక్ష తప్పదని 1 టౌన్ పోలీస్ స్టేషన్ ఆఫీసర్ బి.రఘుపతి అన్నారు. నిజామాబాద్ 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గత కొద్ది రోజులుగా నిర్దేశిత వ్యాపార సమయం దాటిన తరువాత కూడా షాపులు తెరిచి ఉంచి వ్యాపారం నిర్వహిస్తున్న వారిపై ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా షేక్ అబ్బు, అబ్దుల్ ఇద్రిస్, ఆలూరు దాస్, ఎండి ముజీబ్ అనే వ్యక్తులను అరెస్ట్ చేసినట్టు ఆయన తెలిపారు. వారిని సోమవారం స్పెషల్ సెకండ్ క్లాస్ జడ్జి, నిజామాబాదు వారి సమక్షంలో ప్రవేశపరచగా, రెండు రోజుల జైలు శిక్ష విధించారని, కోర్టు ఉత్తర్వుల మేరకు వారిని జిల్లా జైలుకు తరలించామని తెలిపారు. ఎవరైనా నిర్దేశిత సమయానికి మించి షాపులు తెరిచి వ్యాపారం నిర్వహించినట్లయితే, వారి పై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని ఆయన పేర్కొన్నారు.
