- ఎక్స్ లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
హైదరాబాద్, బతుకమ్మ : అది కాళేశ్వరం కమిషన్ కాదు… కాంగ్రెస్ కమిషన్ అని మరోసారి తేటతెల్లమైందనని ఎక్స్ వేదికగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందించారు. కాళేశ్వరం కమిషన్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు నోటీసులు జారీ చేయడంపై ఆమె ఎక్స్ వేదికగా స్పందించారు. ‘ప్రజల కోసం ప్రాణాలను పణంగా పెట్టి పోరాడిన ప్రజానాయకుడు కేసీఆర్ కు రాజకీయ దురుద్దేశంతో, కుట్రపూరితంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేసిన కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇవ్వడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. కాళేశ్వరం ప్రజా ప్రయోజనాల కోసం నిర్మించిన బృహత్ ప్రాజెక్టు. తెలంగాణ ప్రజల తరతరాల దాహార్తిని తీర్చడానికి, తెలంగాణ పొలాల్లోకి గోదావరి నీళ్లను గళగళా తరలించడానికి కట్టిన ప్రాజెక్టు. తాను కలలు గన్న తెలంగాణను కోటి ఎకరాల మాగాణంగా తీర్చిదిద్దడానికి కేసీఆర్ కట్టిన ప్రాజెక్టే కాళేశ్వరం. రాజకీయ కక్షతో, కుట్రతో ఇచ్చిన ఈ నోటీసులు, వేసిన కమిషన్లు కాలక్రమంలో తప్పకుండా న్యాయాన్ని గెలిపిస్తాయి. నిజాలన్నీ బయటకు వస్తాయని, రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’ అని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.
