- ఎస్పీ యం.రాజేష్ చంద్ర
కామారెడ్డి, బతుకమ్మ :నేరం చేస్తే జైలు జీవితం అనుభవించాల్సిందేనని, హత్య కేసులో నిందితునికి జీవిత ఖైదు, రూ.2వేల జరిమానా విధించినట్లు కామారెడ్డి జిల్లా ఎస్పీ యం.రాజేష్ చంద్ర తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం.. 2022 మే 10న ఎల్లారెడ్డి గ్రామానికి చెందిన పసిముద్దీన్ అలియాస్ టిల్లు అనే వ్యక్తి వసీమా బేగం తలపై ఇనుపరాడ్తో బలంగా పలు మార్లు కొట్టి హత్య చేశాడని ఆమె భర్త షేక్ కలీముల్లా ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎల్లారెడ్డి పోలీస్ స్టేషనులో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పరిశోధనలో భాగంగా వసిముద్దీన్ అలియాస్ టిల్లు నిందితుడు ఫిర్యాది ఇంటి గోడకు ఆనుకొని రేకుల షెడ్ నిర్మించాడు. ఈ విషయంపై ఫిర్యాది భార్య వాసీమా బేగం పలు మార్లు నిందితుడుని షెడ్ను కొంత ప్రక్కకు వేసుకోవాలని కోరగా, నిందితుడు చాలా సార్లు ఆమెతో గొడవపడి, సమస్యను పెద్దమనుషుల సమక్షంలో చెప్పినా “నిన్ను చంపుతాను” అంటూ బెదిరించేవాడు. 2022 మే 10న మున్సిపల్ అధికారులు వచ్చి ఆ రేకుల షెడ్ను తొలగించారు. ఇది మనసులో పెట్టుకొని వాసీమా బేగo తన ఇంటి ముందు అరుగుపై కూర్చుని ఉండగా ఐరన్ రాడ్ తో ఆమె తలపై బలంగా పలు మార్లు కొట్టి హత్య చేశాడు. ఈవిషయములో సాక్షులను విచారించి, సరియగు సాక్షాలను సేకరించి నేరస్తుడిని అరెస్టు చేయడం తదుపరి కోర్టు యందు అభియోగ పత్రం వేశారు. కేసులో సాక్షులను విచారించి, సాక్షాదారాలను పరిశీలించి కేసు రుజువు కావడం జరిగిందని జిల్లా న్యాయమూర్తి సీహెచ్.వీఆర్ఆర్ వర ప్రసాద్ నిoదితునికి జీవిత ఖైదు, రూ.2వేలజరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు. పోలీసు తరపున వాదనలు వినిపించిన పీపీ టి.రాజగోపాల్ గౌడ్, ఈ కేసును విచారణ చేసిన అప్పటి ఎలారెడ్డి సర్కిల్ ఇన్స్పెక్టర్లు శ్రీనివాస్, యస్ఐ గణేష్ ప్రస్తుత ఎలారెడ్డి సర్కిల్ ఇన్స్పెక్టర్లు రవీందర్ నాయక్, యస్ఐ మహేష్ కోర్టు లైజనింగ్ ఆఫీసర్ ఏఎస్సై రామేశ్వరు రెడ్డి, సీడీఓ సాయిలు ను జిల్లా ఎస్పీ అభినందించారు.
