. . . జాబ్ మేళా ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి
. . . మెగా జాబ్ మేళాలో సీపీ సాయి చైతన్య
. . . రెండున్నర వేలకుపైగా నిరుద్యోగులు హాజరు
. . . ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
ప్రజాభివృద్ధికి పాటుపడే ఎమ్మెల్యే దొరకడం నిజామాబాద్ యువత అదృష్టమని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తెలిపారు. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ ఆధ్వర్యంలో నగరంలోని శ్రీరామ గార్డెన్ లో ఆదివారం మెగా జాబ్ మేళా నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ సాయి చైతన్య మాట్లాడుతూ… ఇంత పెద్ద మొత్తంలో జాబ్ మేళా నిర్వహించటం అభినందనీయమన్నారు.

రాజకీయంతో పాటు ప్రజల అభివృద్ధికి పాటుపడే వారు అరుదుగా ఉంటారన్నారు. ఇలాంటి అవకాశాలను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. టెక్నాలజీని వినియోగించుకొని ఉన్నత స్థాయికి ఎదగాలన్నారు. కానీ అదే టెక్నాలజీకి వ్యసనం కాకూడదని సూచించారు. ఉద్యోగాలు రానివాళ్లు నిరాశ చెందకుండా మరింత ప్రయత్నించాలన్నారు. ప్రస్తుత ప్రయత్నాన్ని అనుభవంగా పొంది భవిష్యత్తును ఉత్తమంగా తీర్చిదిదుకోవాలన్నారు. ఇందూరు యువతలో ఎంతో ప్రతిభ దాగి ఉంది, వారి ప్రతిభకు అవకాశం కల్పించడం కోసం మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ స్పష్టం చేశారు. ఇందూరు భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందన్నారు.

తల్లిదండ్రులు ఎంతో కష్టపడి పిల్లల్ని చదివిస్తారని, తన బిడ్డ మంచి ఉద్యోగం సాధించి జీవితంలో స్థిరపడాలనేది వారి కోరిక అన్నారు. యువతకు ఉద్యోగం కల్పించడం అంటే కేవలం ఒక వ్యక్తికి ఉద్యోగం ఇవ్వడం కాదని ఒక కుటుంబానికి భరోసా ఇవ్వడం అని స్పష్టం చేశారు. యువతకు సరైన వేదిక దొరకడం లేదని ఆ సమస్యను దృష్టిలో పెట్టుకొని 70కి పైగా కంపెనీలను ఒకే వేదిక పైకి తీసుకోవచ్చామని తెలిపారు. ఇంటర్వ్యూలకు వెళ్లినప్పుడు భయపడకుండా తమపై నమ్మకం పెట్టుకోవాలన్నారు. యువత ఉద్యోగాల కోసం తప్పనిసరిగా హైదరాబాద్కి ఇతర నగరాలకు వెళ్లాల్సిన పరిస్థితి తగ్గాలన్నారు.

నిజామాబాదులో అవకాశాలు పెరగాలని అదే తన లక్ష్యమని పేర్కొన్నారు. నిజామాబాద్ ను ఐటీ హబ్ గా మార్చేందుకు తన వంతు ప్రయత్నం చేస్తున్నానన్నారు ఇటీవల ఐటీ శాఖామంత్రి శ్రీధర్ బాబును కలిసి పలు ప్రతిపాదనలు అందజేయడం జరిగిందన్నారు. త్వరలోనే నిజామాబాద్ ను ఐటీ హబ్ గా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. భవిష్యత్తులో యువతకు తోడుగా నిలుస్తామని చెప్పారు. జాబ్ మేళాకు సుమారు రెండున్నర వేలకుపైగా అభ్యర్థులు హాజరయ్యారు. అనంతరం ఆయా కంపెనీలో ఎంపికైన అభ్యర్థులకు ధ్రువపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో మేయర్ ఉమారాణి, బీజేపీ కార్పొరేటర్లు నాగోల్ల లక్ష్మీనారాయణ, బెల్లాల్ శశాంక్, మఠం పవన్, శ్రవణ్, పసునూరి రాము, ప్రసూన శ్రీనివాస్, ఎర్రం సుధీర్, జగదీష్ కులకర్ణి, బంటు రాము, బంటు ప్రీతి ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

