నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: బీసీ కమిషన్ సభ్యులు మంగళవారం జిల్లా కేంద్రానికి రానున్నారని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్ తెలిపారు. సంఘం ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీసీ కమిషన్ సభ్యులు మంగళవారం ఉదయం 10 గంటల నుంచి కలెక్టరేట్ లో అందుబాటులో ఉంటారని, తమ సమస్యలు, డిమాండ్ లను వివరిస్తూ బీసీ సోదరులు వినతిపత్రాలు అందజేయాలని సూచించారు. క్షేత్రస్థాయిలో బీసీల విద్య ఉద్యోగ ఆర్థిక రాజకీయ సామాజిక స్థితిగతులను రాజకీయ పార్టీలకు అతీతంగా కమిషన్ దృష్టికి తీసుకువెళ్లాలని రాష్ట్ర ఉపాధ్యక్షులు బుస్స ఆంజనేయులు కోరారు. రాష్ట్రంలో ప్రస్తుతం బీసీ కమిషన్ చేసే పర్యటన అత్యంత కీలకమైనదని, ఈ పర్యటన ద్వారానే మన బీసీ కులగణన చేపట్టి స్థానిక సంస్థలు, విద్య, ఉద్యోగ అవకాశాల్లో బీసీలకు తగిన వాటా దక్కుతుందని రాష్ట్ర నాయకుడు ఆకుల ప్రసాద్ అన్నారు. పోల్కం గంగాకిషన్, దర్శనం దేవేందర్, కరిపె రవీందర్, కొయ్యాడ శంకర్, శ్రీలత, రంగన్న, చంద్రకాంత్, సంజీవి, సాయి బసవ, లక్ష్మీనారాయణ, రాజు, సుదర్శన్, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.
