- రెవెన్యూ శాఖ వద్ద వేల సంఖ్యలో పెండింగ్ ఫైల్లు
- 33 మాడ్యూళ్ల స్థానంలో ఆరుకే కుదింపు
- నేడు అధికారికంగా ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి
నిజామాబాద్, బతుకమ్మ : ధరణి వెబ్ సైట్ ఆపేరు చెబితేనే రైతులతో పాటు సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గత ప్రభుత్వం ధరణి వెబ్ సైట్ తీసుకువచ్చి భూములను రక్షణ కవచం చేశామని గొప్పలు చెప్పుకుంది. అయితే క్షేత్ర స్థాయిలో మాత్రం అధికారుల తప్పదాలతో సామాన్యులకు ఇబ్బందులు తప్పలేదు. భూ రికార్డులు ఆన్ లైన్ నమోదు కాకపోవడం, నమోదైనా రికార్డులు తప్పుల తడకగా ఉన్నాయి. వాటిని పరిష్కరించాలని రైతులు, సామాన్యలు తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ధరణి స్థానంలో రాష్ట్ర ప్రభుత్వం ఏప్పిల్ 14న భూ భారతి పోర్టల్ తీసుకువస్తుండటంతో రైతుల ఆశలు చిగురించాయి. రైతులు, ప్రజలకు సలభంగా, వేగంగా సేవలందిస్తూ భూ సమస్యల పరిష్కారానికి క్రుషి చేయాలనే ఉద్దేశంతో భూభారతిని సీఎం రేవంత్ రెడ్డి సోమవారం ప్రారంభించనున్నారు. వ్యవసాయ భూముల రికార్డుల్లో నెలకొన్న గందరగోళం, పాస్ పుస్తకాల జారీలో జాప్యం కారణంగా ఎంతో మంది రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనిని ద్రుష్టిలో ఉంచుకుని ధరణిలోని 33 మాడ్యుళ్లను భూ భారతికి వచ్చే సరికి ఆరుకు కుదించారు.
- ధరణితో అన్నీ తిప్పలే..
ధరణి వెబ్ సైట్ ద్వారా ఎంతో మంది రైతుల భూ రికార్డలు ఆన్ లైన్ లో నమోదు కాకపోగా నమోదైనవి తప్పుల తడకగా ఉన్నాయి. వాటిని సరిదిద్దుకునేందుకు రైతులు ఏళ్ల తరబడి తహసీల్ కార్యాలయాల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. అయితే సమస్యల పరిష్కరించే అధికారం తహసీల్దార్ స్థాయిలో లేకపోవడం, వెబ్ సైట్ నిర్వహణ, సమస్యల పరిష్కారం సక్రమంగా లేకపోవడంతో దరఖాస్తులు కుప్పలు తెప్పలుగా పేరకుపోయాయి. ఈ కారణంగా ధరణి వెబ్ సైట్ పై రైతుల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొంది. నిజామాబాద్ జిల్లాలోనే ధరణి కోసం లక్ష వరకు దరఖాస్తులు రాగా అందులో దాదాపు 40వేలు పరిష్కారానికి నోచుకోలేదు. రెవెన్యూ సదస్సులు నిర్వహించినా అవి పరిష్కారం కాలేదు. తహసీల్దార్ లకు జాయింట్ సబ్ రిజిస్ట్రార్ హోదాను కలిగించినా ధరణిలో మార్పులకు చేర్పులకు అవకాశం ఇవ్వలేదు. మొత్తం వ్యవహారం అంతా కలెక్టర్ ల చేతికి లాగిన్ ఇవ్వడంతో ధరణి భారంగా మారింది.
- భూ భారతి రైతుల సమస్యలకు చెక్..
- పొజిషన్ లో ఉన్నా ఇప్పటి వరకు ఆన్ లైన్ లో భూముల వివరాలు లేకపోవడం, నూతన పట్టా పాస్ పుస్తకాలు రాకపోవడం.
- నూతన పాస్ పుస్తకాలు వచ్చినా పూర్తి స్థాయిలో విస్తీర్ణం నమోదు కాకపోవడం.
- పట్టా భూములు అసైన్డ్ గా, అసైన్డ్ భూములు పట్టాలుగా నమోదవడం. కారణాలు చెప్పకుండా దరఖాస్తుల తిరస్కరణ.
- ఒకరికి చెందిన భూములు మరొకరి పేరు మీద నమోదవడం. తద్వారా గ్రామాల్లో భూ పంచాయితీలు పెరగడం.
- అబాది భూములు వ్యవసాయ భూములుగా, వ్యవసాయ భూములు అబాదిగా నమోదవడం.
- భూ విస్తీర్ణం రికార్డుల్లో హెచ్చుతగ్గుల (ఆర్ఎస్ఆర్) సమస్య కారణంగా రిజిస్ట్రేషన్ లు నిలిచిపోవడం, స్లాట్ రద్దయితే చెల్లించిన డబ్బులు తిరిగారాక పోవడం.
