ఐదు నిమిషాల ఆలస్య అనుమతి అక్కర్లేకుండానే విద్యార్థులు ముందస్తుగా రాక
నిజామాబాద్, బతుకమ్మ:
ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు బుదవారం ప్రారంభం అయ్యాయి.బుధవారం ఉదయం 9 గంటలకు పరీక్ష ప్రారంభం కావడంతో జిల్లాలోని అన్ని పరీక్ష కేంద్రాలకు గంట ముందుగానే 8 గంటలకు విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారు. పరీక్ష రాసేందుకు వచ్చిన విద్యార్ధులను 8.30 గంటల నుంచి పరీక్ష హాల్ లోకి అనుమతించారు. విద్యార్ధులను క్షుణ్ణంగా పరిశీలించి, ఎటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలు లోపలికి అనుమతించలేదు. విద్యార్థులను తనిఖీ చేసి లోపలికి అనుమతించారు. మొదటి పరీక్ష కావడంతో విద్యార్థులతో పాటు తల్లితండ్రులు వారి వెంట వచ్చి విధ్యార్థులలో ఆత్మస్థైర్యాన్ని నింపారు. మొదటి రోజు విద్యార్ధులకు 5 నిమిషాల సడలింపు అవకాశం లేకుండానే పరిక్ష కేంద్రానికి ముందుగా చెరుకున్నారు..

ఇంటర్ పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్…..
జిల్లా కేంద్రంలోని సుభాష్ నగర్ లో గల నిర్మల హృదయ జూనియర్ కళాశాలలో కొనసాగుతున్న ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాన్ని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పరీక్షల తొలిరోజు అయిన బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరీక్షల నిర్వహణ తీరును నిశితంగా పరిశీలించారు. విద్యార్థుల హాజరు గురించి ఆరా తీశారు. సీ.సీ కెమెరా నిఘా నడుమ నిబంధనలకు అనుగుణంగానే పరీక్ష నిర్వహిస్తున్నారా? నిర్ణీత సమయంలో ప్రశ్న పత్రాలను తెరిచారా? లేదా? అని పరిశీలించారు. పరీక్షా కేంద్రాల్లో తాగునీటి వసతి, ఏ.ఎన్,ఎం, టాయిలెట్స్ అందుబాటులో ఉన్నాయా అని గమనించారు. ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా సజావుగా పరీక్షలు జరిపించాలని సూచించారు. పరీక్ష పూర్తయిన వెంటనే ఆన్సర్ షీట్లు తగిన పోలీసు బందోబస్తు మధ్య నిర్దేశిత కేంద్రాలకు తరలించాలని, ఎలాంటి కాపీయింగ్ కు అవకాశం లేకుండా పూర్తి పారదర్శకంగా, పక్కాగా పరీక్షలు జరిపించాలని ఆదేశించారు. ఎలక్ట్రానిక్ వాచీలు వంటి ఉపకరణాలు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించకూడదని సూచించారు. కలెక్టర్ వెంట పరీక్ష కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్ సురయ్య, తదితరులు ఉన్నారు.

