- కలెక్టర్ టి. వినయ్ కృష్ణారెడ్డి
నిజామాబాద్, బతుకమ్మ : ఇందిరమ్మ పథకం కింద ఇళ్లను నిర్మించుకుంటున్న లబ్దిదారులకు ఇసుక అందుబాటులో ఉండేలా చొరవ చూపాలని కలెక్టర్ టి. వినయ్ కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు. జిల్లాలో ఎక్కడ కూడా ఇసుక కొరత కారణంగా ఇళ్ల నిర్మాణాలలో జాప్యం జరుగుతోందనే ఫిర్యాదులు రాకూడదని అన్నారు. బాల్కొండ మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల ప్రగతిని కలెక్టర్ గురువారం క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. బాల్కొండ మండల కేంద్రంలో 41 మందికి ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయగా, లబ్ధిదారులు అందరు ఇళ్లను నిర్మించుకునేలా తోడ్పాటును అందించాలని సూచించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తున్న నేపథ్యంలో, లబ్దిదారులను అన్ని విధాలుగా ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. ఇందులో భాగంగా ఇళ్ల నిర్మాణాలకు ముందుకు వచ్చే వారికి ఉచితంగా ఇసుక అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇళ్ల నిర్మాణాల విషయంలో ఏమైనా ఇబ్బందులు ఉంటే ఆర్డీఓ దృష్టికి తేవాలని సూచించారు. ఏకధాటి వర్షాలు కురిస్తే వాగులు, నదులలో వరద జలాలు చేరుకొని ఇసుక లభించే పరిస్థితి ఉండదని, దీనిని దృష్టిలో పెట్టుకుని సరిపడా ఇసుక నిల్వలను ఇందిరమ్మ లబ్ధిదారులు సమకూర్చుకునేలా చూడాలన్నారు. లబ్ధిదారులను ప్రోత్సహిస్తూ త్వరితగతిన నిర్మాణాలు పూర్తి చేసేలా పర్యవేక్షణ జరపాలని కలెక్టర్ సూచించారు. కలెక్టర్ వెంట ఆర్మూర్ ఆర్డీఓ రాజాగౌడ్, ఎంపీడీఓ విజయ్ భాస్కర్ తదితరులు ఉన్నారు.

