- ఏఐపీకేఎంఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఈ.రమేష్
సిరికొండ, బతుకమ్మ : ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఆత్మీయ భరోసాను వెంటనే ఇవ్వాలని,వ్యవసాయ కూలీలందరికీ రూ. 12 వేల భరోసాను తక్షణమే ప్రకటించాలని అఖిలభారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం (ఏఐపీకేఎంఎస్) జిల్లా ప్రధాన కార్యదర్శి ఈ రమేష్ డిమాండ్ చేశారు. సోమవారం రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా సిరికొండ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ముందు “వ్యవసాయ కూలీలందరికి, ఇందిరా ఆత్మీయ భరోసా 12వేలు” తక్షణమే అమలు చేయాలని డిమాండ్ తో ధర్నా నిర్వహించారు. తహసీల్దార్ కు డిమాండ్స్ తో కూడిన వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు ఉచిత గ్యారెంటీలో భాగంగా వ్యవసాయ కూలీలందరికీ ఇందిరమ్మ ఆత్మీయ భరోసాలు ఇస్తానని హామీ ఇచ్చారన్నారు. కానీ తూతూ మంత్రంగా మండలంలోని ఒక గ్రామాన్ని పైలేట్ గ్రామంగా తీసుకొని కొంతమందిని సెలెక్ట్ చేసుకుని అర కొర ఇవ్వడం, ఇచ్చిన హామీని తుంగలో తొక్కడమెనన్నారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అమలులో ఉపాధి హామీ కూలీలుగా పని చేసిన పని దినాలలో లెక్కధీసుకోవడం, వ్యవసాయంపై ఆధారపడ్డ వ్యవసాయ కూలీలను విస్మరించడం శోచనీయమన్నారు. వ్యవసాయ కూలీలకు వ్యవసాయ రంగంలో వచ్చిన యాంత్రికరణ, వలస కూలీల వల్ల పూర్తిగా ఉపాధి దెబ్బతిన్నది అన్నారు. ఫలితంగా వ్యవసాయ కూలీలకు అన్నమో రామచంద్రా అనాల్సిన దుస్థితి నెలకొన్నది అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం మీనా వేషాలు లెక్కించకుండా నిబంధనలు, పెట్టకుండా ప్రతి వ్యవసాయ కార్మిక కుటుంబానికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద రూ. 12 వేలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వం వ్యవసాయ కూలీలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళనలకు పూనుకుంటామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అఖిలభారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం (ఏఐపీకేఎంఎస్) జిల్లా ఉపాధ్యక్షులు బి. కిషోర్, జి. బాల్ రెడ్డి, కోశాధికారి ఎస్ కిశోర్, ఏ.ఐ.యూ.కే.ఎస్. జిల్లా నాయకులు బి.సర్పంచ్, మండల ఉపాధ్యక్షులు వి. భూమాగౌడ్, మండల నాయకులు నిమ్మల. రాములు, ఎస్.గంగారాం, కే.మోతిలాల్, తదితరులు పాల్గొన్నారు.
