- టీయూసీఐ రాష్ట్ర అధ్యక్షులు వనమాల కృష్ణ,
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : బీడీ కార్మికులకు పెరిగిన కరువు భత్యం అమలు చేయాలని టీయూసీఐ రాష్ట్ర అధ్యక్షులు వనమాల కృష్ణ, డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ (టీయూసీఐ అనుబంధం) రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో బీడీ యాజమాన్యాల సంఘం అధ్యక్ష, కార్యదర్శులను కలిసి నోటీసు ఇచ్చి, యూనియన్ కార్యాలయం శ్రామిక భవన్, కోటగల్లిలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు వనమాల కృష్ణ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఏడు లక్షల మంది బీడీ కార్మికులకు ఏప్రిల్ 1వ తేదీ నుండి పెరిగిన కరువు భత్యం వెంటనే అమలు చేయాలని బీడీ పరిశ్రమల యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. వీడీఏ కరువు భత్యం 104 పాయింట్లు పెరిగిందని, దీని ప్రకారం వేయి బీడీలకు మొత్తం కూలీ రేటు 261.97పైసలు అవుతుందన్నారు. నెలసరి ఉద్యోగులకు నెలకు 312/-, బీడీ ప్యాకర్లకు రోజుకు 10రూపాయల 40 పైసల చొప్పున పెరిగిందన్నారు. పెరిగిన కరువు భత్యం రూపాయలను ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమలు చేయాలని డిమాండ్ చేశారు. యాజమాన్యాలు అలసత్వం ప్రదర్శిస్తే, కరువు భత్యం అమలు కోసం బీడీలు చుట్టే కార్మికులు నెలసరి జీతాల ఉద్యోగులు, బీడీ ప్యాకర్లు ఆందోళనకు సిద్ధం కావాలని బీడీ కార్మికులకు పిలుపునిచ్చారు. ఈ సమావేశం లో యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.నరేందర్, ఉపాధ్యక్షులు కట్ల రాజన్న, రాష్ట్ర సహాయ కార్యదర్శి రాంప్రసాద్, నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు డి రాజేశ్వర్, సిద్దిపేట జిల్లా అధ్యక్షులు శ్రీశైలం, జగిత్యాల జిల్లా బాధ్యులు భీమన్న తదితరులు పాల్గొన్నారు.
