మంత్రి పదవి దక్కకపోవడంతో తీవ్ర అసంతృప్తి
బుజ్జగించేందుకు సుదర్శన్ రెడ్డి ఇంటికి మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్
హైదరాబాద్, బతుకమ్మ : రెండో విడత మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కకపోవడంతో మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. రెండో విడత మంత్రివర్గం విస్తరణలో సామాజిక కూర్పు నేపథ్యంలో ముగ్గురికి మాత్రమే అవకాశం ఇవ్వగా అందులో తన పేరు లేకపోవడంతో ఆయన కినుకు వహించారు. ఉమ్మడి జిల్లా నుంచి గత 18 నెలలుగా మంత్రి పదవిపై సుదర్శన్ రెడ్డి ఆశ పెట్టుకున్నారు. కాగా, రెడ్డి సామాజిక వర్గానికి ఇదివరకే నలుగురికి మంత్రి పదవులు ఉండడంతో సామాజిక సమీకరణాల కారణంగా ఇతర నేతలు ఒత్తిడితో మంత్రి పదవి మిస్ అవుతోంది. రెండో విడత మంత్రివర్గ జాబితాలో తన పేరు లేకపోవడంతో ఆయన తీవ్ర అసంతృప్తి తో తనకు మంత్రి పదవి రాకపోతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని అనుచరులతో అన్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధినాయకత్వం సుదర్శన్ రెడ్డితో మాట్లాడేందుకు ప్రయత్నించారు. కానీ ఆయన అందుబాటులోకి రాలేదు. ఈ నేపథ్యంలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ చార్జి మీనాక్షి నటరాజన్ తో పాటు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్లు సుదర్శన్ రెడ్డి ఇంటికి వెళ్లి బుజ్జగించేందుకు ప్రయత్నిస్తున్నారు. సామజిక వర్గాల సమీకరణలు తర్వాత మూడో విడతలో అవకాశం ఇస్తారని హామీ ఇచ్చినట్టు సమాచారం.
