. పరిశోధనల్లో ఫెయిల్యూర్స్ సహజం
. జిల్లాస్థాయి ఇన్ స్పైర్, వైజ్ఞానిక ప్రదర్శనలను ప్రారంభించిన అర్బన్, రూరల్ ఎమ్మెల్యేలు
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: పరిశోధనలు, ప్రయోగాల్లో ఫెయిల్యూర్స్ సహజమని, నిరాశ చెందకుండా విజయం సాధించేవరకు ప్రయత్నిస్తూనే ఉండాలని రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని సుభాష్ నగర్ లో ఉన్న సెయింట్ ఫ్రాన్సిస్ పాఠశాలలో రెండు రోజుల పాటు కొనసాగనున్న జిల్లాస్థాయి ఇన్ స్పైర్, రాష్ట్రీయ బాల వైజ్ఞానిక ప్రదర్శన – 2024 కార్యక్రమాన్ని శుక్రవారం జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రెండు రోజులపాటు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం జిల్లాకే గర్వకారణమని అన్నారు. ఇన్నోవేషన్ లేకుంటే మనిషి మనుగడే ఉండేది కాదని, ఆదిమానవుని కాలం నుంచి ఇప్పటివరకు ఇన్నోవేషన్ మూలంగానే మానవునిగా మారామని అన్నారు. సైన్స్ ఫెయిర్ వేదిక ద్వారా భవిష్యత్తులో తమ పరిశోధనలతో విద్యార్థులు మంచి స్థాయిలో నిలబడి జిల్లా, రాష్ట్ర, దేశస్థాయిలో తమ ప్రతిభ కనబర్చాలని విద్యార్థులకు సూచించారు. అనంతరం అర్బన్ ఎమ్మెల్యే ధనపాల్ మాట్లాడుతూ.. గత పదేళ్లుగా ప్రధాని నరేంద్ర మోడీ హయాంలో దేశం అన్ని రంగాల్లో, ప్రయోగాలలో ముందుండడం గర్వకారణమన్నారు. రెండు రోజులపాటు జరగనున్న ప్రదర్శనలో తన వంతుగా ఒకరోజు వైజ్ఞానిక ప్రదర్శనకు వచ్చిన విద్యార్థులకు మధ్యాహ్నం భోజనాన్ని తన ట్రస్ట్ ద్వారా ఉచితంగా అందజేస్తున్నట్లు తెలిపారు. అడిషనల్ కలెక్టర్ అంకిత్, డీఈవో అశోక్, స్థానిక కార్పొరేటర్ లతాకృష్ణ, జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్, జిల్లా సైన్స్ అధికారి గంగాకిషన్, ఎస్ ఎఫ్ ఎస్ పాఠశాల ప్రిన్సిపల్ జోసెఫ్ తదితరులు పాల్గొన్నారు.
