. తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసే ధైర్యం ఎవరికీ లేదు
. రౌండ్ టేబుల్ సమావేశంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
హైదరాబాద్, బతుకమ్మ: తెలంగాణ సంస్కృతి, ఉనికిపై జరుగుతున్న దానికి ఖండించకపోతే చరిత్ర మనల్ని క్షమించదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. హైదరాబాద్ లోని సోమాజి గూడ ప్రెస్ క్లబ్ లో శనివారం తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ తల్లి విగ్రహానికి కవిత పూలమాలలు వేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసే ధైర్యం ఎవరికీ లేదని, అయినప్పటికీ అటువంటి ప్రయత్నాలు చేసేవారిని అడ్డుకోవాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మను చూస్తే తెలంగాణ సమాజాన్ని చూసినట్లు ఉంటుందన్నారు. తెలంగాణ తల్లిపై ప్రేమ లేని సీఎం రేవంత్ రెడ్డి రూపం మార్చారని, తెలంగాణ ఉద్యమంలో, పునర్నిర్మాణంలో రేవంత్ ఎక్కడా లేరని దుయ్యబట్టారు. ఉద్యమకాలంలో ఉద్యమకారులపై తుపాకీ ఎక్కుపెట్టిన వ్యక్తి రేవంత్ అని విమర్శించారు. ఒక చేతిలో జొన్న కర్ర, మరో చేతిలో బతుకమ్మను ధరించిన తెలంగాణ తల్లి వైభవంపై పద్యాలు, కవితలు రచించి పుస్తకాలను వెలువరుస్తామని అన్నారు. నోట్ బుక్స్, రైటింగ్ ప్యాడ్ లపై తెలంగాణ తల్లిని ముద్రించి పిల్లలకు పంపిణీ చేసే ప్రయత్నం చేస్తామన్నారు. గ్రామగ్రామాన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తామన్నారు. రేవంత్ రెడ్డి రూపొందించిన విగ్రహానికి కాంగ్రెస్ మాతగా నామకరణం చేస్తూ తీర్మానం చేశారు.

