. రూ.100 కోట్ల ఆస్తులు కూడబెట్టిన ఏడీఈ
. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ
. విద్యుత్ శాఖలో కలకలం
వెబ్ న్యూస్, బతుకమ్మ: సైబర్ సిటీ(హైదరాబాద్) సర్కిల్ పరిధిలోని గచ్చిబౌలి సబ్ డివిజన్ లో ఏడీఈగా విధులు నిర్వర్తిస్తున్న అసిస్టెంట్ డివిజనల్ ఇంజినీర్ (ఏడీఈ) సతీశ్ రూ.70వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడు. అపార్ట్ మెంట్ కు ట్రాన్సఫార్మర్ మంజూరును పెండింగ్ లో పెట్టిన సతీశ్.. ఆ పనిని పూర్తి చేసేందుకు ఓ వ్యక్తి నుంచి రూ.70వేల లంచం డిమాండ్ చేయడంతో సదరు వ్యక్తి ఏసీబీని ఆశ్రయించాడు. దీంతో ఆయనను లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఉద్యోగంలో చేరిన కేవలం 13 ఏళ్లలోనే సతీశ్ రూ.100 కోట్ల వరకు అక్రమంగా సంపాదించారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. హైదరాబాద్ శంకర్ పల్లి, కరీంనగర్ తదితర ప్రాంతాల్లో 22 ఎకరాల భూమి కొనుగోలు చేయడంతోపాటు ఓపెన్ ప్లాట్లు, ఒక విల్లా, ఫ్లాట్, మూడంతస్తుల భవనం, కిలోకు పైగా బంగారం, రూ.3లక్షల నగదు సతీశ్ ఆస్తుల్లో ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు.
టీజీఎన్పీడీసీఎల్ లో 13 ఏళ్ల క్రితం ఉద్యోగంలో చేరిన సతీశ్ గచ్చిబౌలి సబ్ డివిజన్ ఏడీఈ పోస్టును రూ.70 లక్షలు ముట్టజెప్పి దక్కించుకున్నాడనే ఆరోపణలున్నాయి. దీంతో ఉన్నతాధికారులను సైతం అతడు లెక్క చేసేవాడు కాదని, సుదీర్ఘకాలం ఒకే ప్రాతంలో కొనసాగుతున్నాడని ఆ శాఖ అధికారులే అంటున్నారు.