. . . సీపీఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
కష్టానికి తగిన ఫలితం ప్రజలందరికీ అందే విధంగా సోషలిస్టు వ్యవస్థ నిర్మించి, దోపిడీ లేని, వివక్షత లేని సమాజాన్ని ఏర్పాటు చేయటం ద్వారా లెనిన్ ప్రపంచానికి మార్గదర్శకుడయ్యారని సీపీఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు అన్నారు. బుధవారం లెనిన్ జయంతి సందర్భంగా సిపిఎం పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మార్క్స్ సిద్ధాంతానికి అనుగుణంగా కార్మిక వర్గ నాయకత్వంలో కష్టజీవుల్ని ఐక్యం చేసి జార్ చక్రవర్తి నియంతృత్వ విధానానికి వ్యతిరేకంగా పోరాటం చేసి, విప్లవాన్ని సాధించి లెనిన్ సోషలిస్ట్ వ్యవస్థను నిర్మించారని అన్నారు. దాన్ని ఆదర్శంగా తీసుకొని ప్రపంచంలోని అనేక దేశాల్లో విప్లవాలు వచ్చి సోషలిస్టు వ్యవస్థకు అంకురార్పణ జరిగిందని తెలిపారు. భారత దేశంలో కూడా మిశ్రమ ఆర్థిక వ్యవస్థ ఉన్నదని, దోపిడీ విధానాలకు వ్యతిరేకంగా పోరాడి విప్లవాన్ని సాధించి సోషలిస్టు వ్యవస్థను నిర్మించాల్సిన అవసరం ఉందని ఆయనన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పెద్ది వెంకట్ రాములు మాట్లాడారు అదే విధంగా పార్టీ జిల్లా కమిటీ సభ్యులు సుజాత విగ్నేష్ నగర నాయకులు అంజయ్య రాజు తదితరులు పాల్గొన్నారు.
