నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : గిరిరాజ్ ప్రభుత్వ కళాశాల కొరవి గోపరాజు తెలుగు విభాగం ఆధ్వర్యంలో మంగళవారం ప్రముఖ పాత్రికేయులు, రాష్ట్ర స్థాయి ఉత్తమ జర్నలిస్ట్ అవార్డ్ గ్రహీత పుల్లూరు నరేందర్ చేత “ప్రచార, ప్రసార సాధనాలు- రచన విధానాలు”అనే అంశంపై అతిథి ఉపన్యాసం నిర్వహించారు. ముఖ్యవక్త మాట్లాడుతూ సమాజంలో వేగవంతంగా సమాచారాన్ని అందించడానికి అంతర్జాలపత్రికలు వెబ్ సైట్స్, వాట్స్ అప్, టెలివిజన్ లైవ్ కార్యక్రమాలు అందించే సాధనాలతో పాటు దినపత్రికలు అనేకం అందుబాటులో ఉన్నాయని, అందుకు తగినట్టుగా సమాచారంను ఖచ్చితత్వం పాటిస్తూ అందించటంలో తీసుకోవలసిన జాగ్రత్తలపై, రచన విధానాలపై విస్తృతోపన్యాసం చేశారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పి.రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ తెలుగు భాషపై పట్టు సాధిస్తే జర్నలిజం రంగంలోనూ ఉపాధి అవకాశాలు లభిస్తాయని అన్నారు. కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్. రంగరత్నం, మాట్లాడుతూ విద్యార్థులు లేఖన నైపుణ్యాలతో పాటు, సాంకేతికనైపుణ్యాలను మెరుగు దిద్దుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పీఆర్.ఓ. డాక్టర్ దండుస్వామి, ఐ.క్యూ.ఏ.సి. కోఆర్డినేటర్ డాక్టర్ రాజేష్, అకాడమిక్ కోఆర్డినేటర్ నహేద బేగం,రాహుల్, తెలుగు విభాగం అధిపతి లెఫ్టినెంట్ డాక్టర్ ఎం. రామస్వామి, కార్యక్రమ నిర్వాహకురాలు బి.రాధిక, తెలుగు అధ్యాపకులు కె.గంగాధర్, డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ శమంత, ఆర్.రాజేశ్వర్, అర్చన, సుభాషిణి దేవి, తదితర అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
