. . . ప్రగతి హాస్పిటల్ లో ఘటన
. . . పరస్పరంగా పోలీసులకు ఫిర్యాదు
. . . కేసు నమోదు చేసిన పోలీసులు
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రగతి ఆసుపత్రిలో అమానుష ఘటన జరిగింది. గుండెపోటుకు వైద్యం కోసం చేరిన వృద్దురాలు చికిత్స పొందుతూ మరణించగా ఆమె ఒంటిపై ఉన్న బంగారు నగలు మాయమయ్యాయి. ఈ సంఘటన మంగళవారం ఉదయం వెలుగు చూసింది. నగరంలోని సీతారాంనగర్ కాలనీకి చెందిన గంగుబాయి తన ఇంట్లోనే గుండెపోటుతో అస్వస్థతకు గురయ్యారు. కుటుంబ సభ్యులు హుటాహుటిన నగరంలోని లక్ష్మారెడ్డి(ప్రగతి ఆసుపత్రి)లో చేర్పించారు. గంగుబాయి చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున మృతి చెందింది. ఇంటెన్సీవ్ కేర్ లో ఉన్న గంగుబాయి మరణవార్త తెలిసిన కుటుంబ సభ్యులు అక్కడికి వెళ్లి పరిశీలించగా ఆమె మెడలోని 18 గ్రాముల బంగారం మాయమైన విషయాన్ని గుర్తించారు. ఈ విషయంపై ఆసుపత్రి సిబ్బందితో వాగ్వివాదానికి దిగారు. చివరకి గంగుబాయి కుటుంబ సభ్యులు నగరంలోని 1వ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఆసుపత్రి నిర్వాహకులు కూడా గంగుబాయి కుటుంబ సభ్యులపైనే అనుమానం వ్యక్తం చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు 1వ టౌన్ ఎస్ హెచ్ వో రఘుపతి తెలిపారు.
