- టీచర్ల సమస్యలపై కొట్లాడుతా
- ఎమ్మెల్సీ అభ్యర్థి మల్క కొమరయ్య
- కామారెడ్డి, నిజామాబాద్, మెదక్ జిల్లాలో ప్రచారం
నిజామాబాద్, బతుకమ్మ : మెదక్, కామారెడ్డి, నిజామాబాద్: ఒక్క అవకాశం ఇస్తే.. టీచర్ల సమస్యలపై మండలిలో పోరాడుతానని బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్క కొమరయ్య తెలిపారు. గతంలో గెలిచిన ఎమ్మెల్సీలు టీచర్ల సమస్యలపై గొంతెత్తలేదని, అందుకే ప్రభుత్వాలు మారుతున్నా.. ఎక్కడి సమస్యలు అక్కడే నిలిచిపోయినట్లు ఆయన గుర్తు చేశారు. ఈ మేరకు గురువారం ఆయన కామారెడ్డి, నిజామాబాద్, మెదక్ జిల్లాలో ప్రచారం నిర్వహించారు. రామయంపేట పట్టణంలో టీచర్ల ఇంటికి వెళ్లి ఓట్లు అభ్యర్థించారు. సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులకు గతంలో ప్రతిపక్షంగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి చాయ్ తాగే టైంలో సమస్య పరిష్కరిస్తామని చెప్పారని, ఇప్పటికీ పరిష్కరించకపోవడం చాలా బాధాకరమని అన్నారు. సమగ్ర శిక్ష ఉద్యోగులు నెల రోజులు ధర్నా చేసినా వారికి ఎలాంటి హామీ ఇవ్వకపోవడం, ధర్నా చేసిన నెల రోజుల జీతం ఇప్పటికీ రాకపోవడం దారుణమని గుర్తు చేశారు. కేజీబీవీ, మోడల్ స్కూల్, రెసిడెన్షియల్ పాఠశాలల సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆయనతోపాటు ఉన్న తపస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నవాత్ సురేష్ మాట్లాడుతూ.. మోడల్ స్కూల్ ఉపాధ్యాయులకు 010 కింద జీతాలు ఇవ్వాలని, 2003 ఉపాధ్యాయులకు కేంద్ర ప్రభుత్వం పాత పెన్షన్ లోకి తీసుకొచ్చినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం తీసుకురాకపోవడం దారుణమని, వెంటనే 2003 కంటే ముందు ఉన్న ఉద్యోగ ఉపాధ్యాయులందరికీ పాత పెన్షన్ విధానంలోకి తీసుకురావాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా తపస్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జిడ్డు ఎల్లం, చల్లా లక్ష్మణ్, రామాయంపేట మండల ప్రధాన కార్యదర్శి సంతోష్ కుమార్, తపస్ జిల్లా బాధ్యులు ప్రవీణ్, సాంగని యాదగిరి, మన్నే గోపాల్, సతీష్ తదితరులు పాల్గొన్నారు.
- టీఎస్ టీఈయూ మద్దతు
కరీంనగర్ మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ ఎమ్మెల్సీ అభ్యర్థికి ఉపాధ్యాయ, అధ్యాపక సంఘాల నుంచి మద్దతు పెరుగుతున్నది. ఇప్పటికే పదికి పైగా సంఘాలు సంపూర్ణ స్వచ్ఛంద మద్దతు ప్రకటించగా.. గురువారం తెలంగాణ గిరిజన ఉద్యోగ సంఘం(టీఎస్ టీఈయూ) మద్దతు తెలిపింది. ఈ మేరకు సంఘం అధ్యక్ష, కార్యదర్శులు రాథోడ్ అశోక్ సింగ్, సంతోష్ నాయక్ మద్దతు ప్రతిని మల్క కొమరయ్యకు అందజేశారు.

