. . . జార్జ్ రెడ్డి వర్థంతి పోస్టర్స్ ఆవిష్కరణ
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
ఏప్రిల్ 10 నుంచి 14 వరకు జరపనున్న జార్జ్ రెడ్డి 54వ వర్థంతి సభలను విజయవంతం చేయాలని తెలంగాణ యునివర్సిటీ పీడీఎస్ యు అధ్యక్షులు అక్షయ్ కుమార్ అన్నారు. తెలంగాణ యునివర్సిటీ పి డి ఎస్ యూ ఆధ్వర్యంలో ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ముందు అసిస్టెంట్ ప్రొఫెసర్ డా.వి.దత్త హరి, డా.సిహెచ్.శ్రీనివాస్ ల చేతుల మీదుగా జార్జ్ రెడ్డి 54వ వర్ధంతి పోస్టర్స్ ని గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అక్షయ్ కుమార్ మాట్లాడుతూ కామ్రేడ్ జార్జి రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీలో విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం ప్రగతిశీల విద్యార్థి ఉద్యమాలను నిర్మించాడని, అసమానతలు లేని సమాజ మార్పు కోసం పోరాటం నిర్వహించారని, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఫిజిక్స్ డిపార్ట్మెంట్ లో మొట్టమొదటిసారిగా యూనివర్సిటీ చరిత్రలో గోల్డ్ మెడల్ సాధించాడని, యూనివర్సిటీ లో తన ప్రతిభను చాటుతూ విద్యార్థి ఉద్యమాలకు దిశా నిర్దేశం చేశారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ విధానాల వలన విశ్వవిద్యాయాలను కాషాయీకరించడానికి అనేక కుట్రలు పన్నుతున్నారని, ఈ కుట్రలను తిప్పి కొట్టాలని యూనివర్సిటీ విద్యార్థులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తె.యూ పి డి ఎస్ యూ నాయకులు రాకేష్, జయంతి, వినీల్, ప్రవీణ, నవ్య హనుమాన్లు, సాయిరాం, తిరుపతి, యశ్వంత్ తదితరులు పాల్గొన్నారు.
