నిజామాబాద్, బతుకమ్మ : గ్రామ పంచాయతీ ఎన్నికల సాధారణ పరిశీలకులు జీ.వీ.శ్యాంప్రసాద్ లాల్ క్లస్టర్ గ్రామ పంచాయతీలను ఆదివారం విస్తృత స్థాయిలో తనిఖీలు చేశారు. మొదటి విడతలో ఎన్నికలు జరుగుతున్న బోధన్ డివిజన్ లో శనివారం సాయంత్రం నాటితో నామినేషన్ల స్వీకరణ పూర్తయ్యింది. దీంతో దాఖలైన నామినేషన్లను ఆదివారం స్క్రూటినీ జరిపారు. ఈ నేపథ్యంలో ఎన్నికల జనరల్ అబ్జర్వర్ శ్యాంప్రసాద్ లాల్ క్లస్టర్ గ్రామ పంచాయతీలను సందర్శిస్తూ స్క్రూటినీ ప్రక్రియను నిశితంగా పరిశీలించారు. పోతంగల్, కోటగిరి, రుద్రూర్, సాలూర గ్రామ పంచాయతీలను సందర్శించి, నిబంధనలకు అనుగుణంగా నామపత్రాల పరిశీలన ప్రక్రియను నిర్వహించారా, ఏవైనా పొరపాట్లకు ఆస్కారం కల్పించారా అని క్షుణ్ణంగా పరిశీలన జరిపారు. తిరస్కరణకు గురైన నామినేషన్ల వివరాలు అడిగి తెలుసుకున్నారు. అభ్యర్థులు, వారి ప్రతినిధుల సమక్షంలో ఈ ప్రక్రియ పూర్తి చేశారా అని ఆరా తీశారు. అనంతరం రుద్రూర్ ఎంపీడీఓ కార్యాలయంలో ఎన్నికల సామాగ్రిని పరిశీలించారు. ఎడపల్లి మండల పరిషత్ కార్యాలయంలో టీ-పోల్ అప్ డేషన్ ప్రక్రియను తనిఖీ చేశారు. డివిజనల్ పంచాయతీ అధికారి నాగరాజు, ఇతర అధికారులతో సమావేశమై పోలింగ్, కౌంటింగ్ ఏర్పాట్లపై చర్చించారు.

