కామారెడ్డి, బతుకమ్మ: లింగనిర్ధారణ పరీక్షల కేసులో గతంలో పట్టుబడిన సిద్ధిరాముల వద్ద పని చేసిన వారే మొబైల్ టీముగా ఏర్పడి ఇళ్లలో లింగనిర్దారణ పరీక్షలు నిర్వహిస్తున్నారని జిల్లా వైద్యాధికారి చంద్రశేఖర్ తెలిపారు. జిల్లా వైద్యారోగ్యశాఖ కార్యాలయంలో రాష్ఱ్ట ప్రోగ్రాం ఆఫీసర్ సుమిత్రానాయక్, పట్టణ సీఐ చంద్రశేఖర్ రెడ్డితో కలిసి సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈనెల 25వ తేదీన రెండు స్కానింగ్ మిషన్లను సీజ్ చేసి విట్టం నడిపి సిద్దిరాములుతోపాటు ఆయన వద్ద పనిచేసే పృథ్వీకి నోటీసులు జారీ చేశామన్నారు. సీజ్ చేసిన ఒక మిషన్ సిద్ధిరాములు కొడుకు ప్రవీణ్ పేరిట రిజిస్ట్రేషన్ అయి ఉందని,మరో మిషన్ ఎవరి పేరుపై ఉందో తేల్చేందుకు విచారణ కొనసాగుతోందన్నారు. రాజంపేటలో లింగ నిర్దారణ ఘటనపై విచారణ కొనసాగుతోందన్నారు. లింగ నిర్దారణ పరీక్షల కట్టడిలో తమ శాఖ తరఫున ఎలాంటి లోపం లేదని, ప్రజల్లో అవగాహన వస్తే తప్ప దీనిని కట్టడి చేయలేమని అన్నారు. సిద్దిరాములపై నమోదైన కేసులో పెద్ద ఎత్తున ఆర్థిక లావాదేవీలు జరిగాయన్న ప్రశ్నకు బదులిస్తూ.. తాను ఆ సమయంలో లేనని డీఎంహెచ్ వో తెలిపారు. గతంలో కేసులు నమోదు చేసి సమన్విత ఆస్పత్రిని సీజ్ చేస్తే హైకోర్టు నుంచి స్టే తెచ్చుకుని రిలీజ్ చేసుకున్నారని తెలిపారు. కామారెడ్డి పట్టణంలో 29 ఆస్పత్రులకు అనుమతులున్నాయని తెలిపారు.

