- 2.5 కేజీల నిషేధిత గంజాయి స్వాధీనం
నందిపేట్, బతుకమ్మ: నందిపేట్ పరిధిలో అక్రమంగా గంజాయి రవాణా జరుగుతోందన్న సమాచారంపై అర్మూర్ రూరల్ సీఐ శ్రీధర్ రెడ్డి దిశానిర్దేశంలో, నందిపేట్ ఎస్ఐ చిరంజీవి ఆధ్వర్యంలో ఆదివారం పోలీసులు ముమ్మర తనిఖీలు నిర్వహించారు. వాహనాలు తనిఖీ చేస్తుండగా, వెల్మల్ చౌరస్తా వద్ద అనుమానాస్పదంగా స్కూటీపై వస్తున్న ఇద్దరిని ఆపి పరిశీలించగా, వారి వద్ద 2.5 కేజీల నిషేధిత గంజాయి బయటపడింది. గంజాయిని, స్కూటీని, సెల్ఫోన్లను స్వాధీనం చేసుకుని నిందితులను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో ప్రధాన నిందితుడు షేక్ ఆఫ్రోజ్ గతంలో మూడుసార్లు గంజాయి కేసుల్లో జైలుకు వెళ్లినట్టు పోలీసులు తెలిపారు.
- అక్రమ కార్యకలాపాలకు అడ్డుకట్ట..
నిజామాబాద్ సీపీ సింధు శర్మ ఆదేశాల మేరకు, అర్మూర్ రూరల్ సీఐ శ్రీధర్ రెడ్డి, నందిపేట్ ఎస్ఐ చిరంజీవి తమ సిబ్బందికి కఠిన సూచనలు జారీ చేశారు. సమాజంలో పెరిగిపోతున్న గంజాయి రవాణా, వ్యభిచారం వంటి అసాంఘిక కార్యకలాపాలను అరికట్టేందుకు రాత్రింబవళ్లు ప్రత్యేక చర్యలు చేపట్టారు.
- వ్యభిచార గృహాలపై పోలీసుల గట్టి నిఘా..
నందిపేట్ ఎస్ఐ చిరంజీవి, అర్మూర్ రూరల్ సీఐ శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో ఇదివరకే ఓ భారీ ఆపరేషన్ నిర్వహించి వ్యభిచార (సెక్స్ రాకెట్) గుట్టు రట్టు చేశారు. ప్రధాన నిందితులను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. అయితే, ఈ వ్యవహారంలో ఇంకా పలువురి ప్రమేయం ఉన్నట్టు అనుమానిస్తున్న పోలీసులు, నిందితుల నుంచి వివరాలు సేకరించి సంబంధిత నెట్వర్క్ను పూర్తిగా ఛేదించే పనిలో ఉన్నారు.