డిచ్ పల్లి, బతుకమ్మ : పలు జిల్లాల్లో చోరీలకు పాల్పడుతున్న ముఠా నాయకుడిని అరెస్ట్ చేసినట్లు డిచ్పల్లి సీఐ మల్లేశ్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. ఒకే కుటుంబానికి చెందిన దాసరి మురళీకృష్ణ, నర్సయ్య, గణేష్, రాజేష్, రావుల శివ, సమ్మక్క, భవాని, రేణుక, నాగయ్య సులభంగా డబ్బులు సంపాదించాలని నిర్ణయించుకున్నారు. దీంతో ముఠాగా ఏర్పడి నిజామాబాద్, కామారెడ్డి, సిద్దిపేట్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, మెదక్ జిల్లాల్లో ఐదునెలలుగా వరుస చోరీలకు పాల్పడుతూ.. తప్పించుకుని తిరుగుతున్నారు. ఈ క్రమంలో ఓ చోరీ కేసులో గతనెలలో రాజేష్, రావుల శివను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చారు. అంతేగాక, మిగిలిన ముఠా సభ్యుల కోసం సీఐ మల్లేష్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టగా, మంగళవారం ఇందల్వాయి ఎస్సై సందీప్, సిబ్బందితో కలిసి ముఠాలోని ముఖ్య సభ్యుడు దాసరి మురళీకృష్ణను అరెస్ట్ చేశారు. ఈ మేరకు అతని వద్ద నుంచి 7 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.
