బతుకమ్మ, బోధన్ : బోధన్ పట్టణంలో గణేష్ నవరాత్రి వేడుకలు భక్తిశ్రద్ధల మధ్య కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో శ్రీ కురుమ గణేష్ మండలి ఆధ్వర్యంలో మంగళవారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. పట్టణంలోని కుర్మ గల్లీలో కురుమ యూత్ సభ్యులు ప్రతిష్ఠించిన వినాయకుడి వద్ద ఉదయం నుంచే ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించగా, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పూజా కార్యక్రమాల అనంతరం భక్తులకు ప్రసాద వితరణ జరిపారు. స్థానికులు, భక్తులు రద్దీగా తరలి వచ్చి భక్తిశ్రద్ధలతో వినాయకుడిని దర్శించుకున్నారు. నిర్వాహకులు ప్రత్యేక అలంకరణలతో గణేష్ విగ్రహాన్ని అలరార్చగా, ధూపదీపాలతో వాతావరణం ఆధ్యాత్మికంగా మారింది. అదే విధంగా, కమిటీ ఆధ్వర్యంలో సామూహిక కుంకుమార్చన కార్యక్రమం కూడా నిర్వహించనున్నట్లు సభ్యులు వెల్లడించారు. భక్తులకు సేవ చేయడం ఆనందంగా ఉందని కురుమ యూత్ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సతీష్, వినోద్, సతీష్ రాజు, శివశక్తి కుమార్, బన్నీ, అశోక్, నాగరాజ్, పోశెట్టి, సాయిలు తదితరులు పాల్గొని సేవా కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

