- బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్క కొమురయ్య
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: తనను ఎమ్మెల్సీగా గెలిపిస్తే విద్యా సంస్థల బకాయిల విడుదలకు పోరాటం చేస్తానని ఎమ్మెల్సీ అభ్యర్థి మల్క కొమురయ్య హామీ ఇచ్చారు. నగరంలోని నిఖిల్ సాయి హోటల్ లో బుధవారం ఎమ్మెల్సీ ఎన్నికల బీజేపీ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరిస్తానని తెలిపారు. గత ప్రభుత్వాలు ఉపాధ్యాయులకు అన్యాయం చేశాయని అన్నారు. సమయానికి వేతనం ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టారన్నారు. మోడీ నాయకత్వంలో విద్యావ్యవస్థ దేశంలోనే చాలా మంచి మార్పు తీసుకొస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో అలాంటి పరిస్థితి లేదని రాష్ట్రంలో విద్యా వ్యవస్థ నీరుగారిపోయే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.

అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్న మల్క కొమురయ్య మంచి మనిషి.. విద్యావేత్త.. వివాదరహితుడు.. 40 ఏళ్లుగా విద్యావ్యవస్థలో చాలా అనుభవం ఉన్న గొప్ప వ్యక్తి అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఇచ్చిన హామీలన్నీ నిలబెట్టలేని పరిస్థితిలో ఉందన్నారు. ప్రజలంతా తిరగబడుతున్నారని తెలిపారు. తెలంగాణలో బిజెపి ప్రత్యమ్నాయ పార్టీగా భవిష్యత్తులో కచ్చితంగా ప్రజలకు సేవలు అందిస్తుందని అన్నారు. కార్యకర్తలు కష్టపడి రెండు ఎమ్మెల్సీ స్థానాలను బిజెపికే వచ్చేలా కష్టపడాలని సూచించారు. అసెంబ్లీ సమావేశంలో కూడా బీసీలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ కచ్చితంగా భవిష్యత్తులో భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కచ్చితంగా బిజెపికి పట్టం పడతారని అన్నారు. బిజెపి తెలంగాణలో అధికారం చేపట్టే విధంగా మనమంతా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఇప్పటికే బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు తెలంగాణలో విఫలం అయ్యాయని కచ్చితంగా భవిష్యత్తులో బిజెపి ప్రత్యామ్నాయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి, రాష్ట్ర నాయకులు మల్లికార్జున్ రెడ్డి, మేడపాటి ప్రకాష్, టక్కర్ హనుమంత్ రెడ్డి లక్ష్మీనారాయణ, స్రవంతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

