. . . అడిగిన ప్రతి ఒక్కరికి ఎరువులను అందించాలి
. . . సీపీఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు బుర్రి ప్రసాద్
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
జిల్లాలో ఎరువుల కొరతను నివారించాలని, అడిగిన ప్రతి ఒక్కరికి ఎరువులను అందించాలని సీపీఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు బుర్రి ప్రసాద్ అన్నారు. శనివారం సిపిఎం పార్టీ జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లలో యూరియా కొరత పెరుగుతుందని, ప్రధానంగా వరి నాట్ల కొరకు సిద్ధమవుతున్న రైతులకు యూరియా కొరత ఉండటంతో పాటు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని నిబంధన పెట్టడం మూలంగా రైతులకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అర్థం కాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. రోజుల తరబడి ఎరువుల దుకాణాలకు తిరుగుతున్నారని, ప్రభుత్వం వెంటనే ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ రద్దుచేసి రైతులకు అందుబాటులో ఎరువులను ఉంచాలని ఆయన డిమాండ్ చేశారు. వరి నారు ముదిరిపోయి సకాలంలో నాట్లు వేయని యెడల రైతుల పెట్టుబడి నష్టపోయే ప్రమాదం ఉందని ఆయనన్నారు. ఉమ్మడి జిల్లా పరిధిలో ప్రజల్లో మత విద్వేషాలను రెచ్చగొట్టుతూ రాజకీయ లబ్ధిని పొందాలని చూస్తున్నారని, ఇది ప్రజలకు ఏమాత్రం ఉపయోగకరంగా ఉండదని, ప్రజా సమస్యలు పరిష్కారం కావని, నాయకులు ప్రజల్లో విద్వేషాలను పెంచటానికి ప్రయత్నించే బదులు ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాలని ఆయన హితవు పలికారు. ప్రజలు దీనిని అర్థం చేసుకొని శాంతియుతంగా వ్యవహరించాలని ఆయన కోరారు. రాజకీయ ఘర్షణలకు తావు లేకుండా ప్రజా సమస్యలపై రాజకీయ పార్టీలు దృష్టి పెట్టాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు, కార్యదర్శి వర్గ సభ్యులు పెద్ది వెంకట్ రాములు, పల్లపు వెంకటేష్, జిల్లా కమిటీ సభ్యులు నన్నే సాబ్ తదితరులు పాల్గొన్నారు.
