యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలో ఘటన
చౌటుప్పల్, బతుకమ్మ : యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం ఖైతాపురం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై స్కార్పియో కారు ఓ లారీని ఢీకొట్టింది. ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మృతులను ఆంధ్రప్రదేశ్కు చెందిన డీఎస్పీలు మేక చక్రధర్ రావు, కాంతారావుగా గుర్తించారు. విజయవాడ నుంచి హైదరాబాద్ కు వస్తున్న స్కార్పియో అదుపుతప్పి డివైడర్ ను ఢీ కొట్టి… రోడ్డు అవతలి వైపు పడింది. అటుగా వస్తున్న లారీ స్కార్పియోను ఢీకొనడంతో వాహనం ముందు భాగం నుజ్జునుజ్జుయింది. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని వాహనంలో ఇరుక్కుపోయిన మృతదేహాలను బయటకు తీశారు. ఈప్రమాదంలో ఏఎస్పీ ప్రసాద్, డ్రైవర్ నర్సింగరావులకు తీవ్ర గాయలవడంతో ఆస్పత్రికి తరలించారు. మృతి చెందిన వారు ఏపీ ఇంటెలిజెన్స్ అండ్ సెక్యూరిటీ వింగ్లో పనిచేస్తుండగా, ఓ కేసు విషయమై విజయవాడ నుంచి హైదరాబాద్ వస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది.
