నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : విద్యార్థి సంఘాల నాయకులపై పెట్టిన తప్పుడు కేసును శుక్రవారం కొట్టివేశారని విద్యార్థి సంఘాల నాయకులు తెలిపారు. శ్రీ చైతన్య పాఠశాల యజమాన్యం కోవిడ్ సమయంలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా క్లాసులు నిర్వహిస్తుందని ప్రశ్నించినందుకు విద్యార్థి సంఘాల నాయకులు రఘురాం, బొడ.అనిల్, సజ్జనం భానుచందర్, వేణు రాజ్, కిరణ్, అన్నందాస్ జ్వాలా లపై తప్పుడు కేసు పెట్టీ తమ తప్పులు కప్పిపుచ్చుకోవాలని చూశారని అన్నారు. ఎప్పటికైనా న్యాయం గెలుస్తుందని ఈ కేసుతో నిరూపనయిందని తెలిపారు. విద్యార్థి సంఘ నాయకుల తరఫున ప్రముఖ న్యాయవాది రావులపల్లి జగదీశ్వరరావు, మానస గౌడ్ వాదించారని తెలిపారు. అన్ని ఆధారాలను పరిశీలించిన తర్వాత అడిషనల్ జడ్జి పాముజూల శ్రీనివాసరావు ఎటువంటి ఆధారాలు లేని తప్పుడు కేసును నిర్దోషులుగా ప్రకటిస్తూ శుక్రవారం తప్పుడు కేసును కొట్టి వేశారని తెలిపారు. ఇది విద్యార్థి సంఘాల ఘనవిజయం అని పేర్కొన్నారు.
