. . . ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
అర్హులైన ప్రతి ఓటరు ఎస్ఐఆర్ ప్రక్రియలో తప్పనిసరిగా పాల్గొని తన ఓటు హక్కును పరిరక్షించుకోవాలని తెలంగాణ ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ పిలుపునిచ్చారు. నిజామాబాద్ పట్టణంలోని బోధన్ రోడ్డులోని ఇంపీరియల్ గార్డెన్లో బుధవారం నిర్వహించిన ఎస్ఐఆర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) అవగాహన సదస్సులో తెలంగాణ ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్, మౌలానా జాఫర్ పాషా, మౌలానా షా జమాలు రహమాన్, తాహెర్ బిన్ హందాన్ లు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. మైనార్టీ ప్రాంత ప్రజలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువత, మహిళలు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో ఓటు హక్కు అత్యంత విలువైనదని, ప్రతి ఒక్కరూ తమ పేర్లు ఓటరు జాబితాలో సక్రమంగా ఉన్నాయో లేదో వెంటనే పరిశీలించి అవసరమైతే నమోదు, సవరణ, ధృవీకరణ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని సూచించారు.

అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు కావాలని, ఎలాంటి డూప్లికేట్ ఓట్లు నమోదు కాకుండా అప్రమత్తంగా ఉండాలని, ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక సవరణ కార్యక్రమానికి ప్రజలంతా సహకరించాలని కోరారు. అవసరమైన పత్రాలను సమర్పించి నమోదు ప్రక్రియను ఆలస్యం చేయకుండా పూర్తి చేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ, భారతీయ జనతా పార్టీపై రాజకీయ విమర్శలు చేస్తూ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కాంగ్రెస్కు అనుకూలంగా ఉండే ఓట్లను, ముఖ్యంగా మైనార్టీ ఓట్లను తొలగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. అలాంటి చర్యల కారణంగానే బెంగాల్, అస్సాం, బీహార్ వంటి రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ నష్టపోయిందని ఆయన వ్యాఖ్యానించారు. అందువల్ల మైనార్టీలు, కాంగ్రెస్ అనుకూల ఓటర్లు మరింత అప్రమత్తంగా ఉండి తమ ఓటు హక్కును కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. మైనార్టీ ప్రాంతాల్లోని ప్రతి కుటుంబం తమ ఓటరు వివరాలను తప్పనిసరిగా ధృవీకరించుకోవాలని, కొత్తగా అర్హత పొందిన యువత ఓటరుగా నమోదు కావాలని ఆయన కోరారు. ఓటు హక్కును కాపాడుకోవడం అంటే ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడమేనని పేర్కొన్నారు. ఎస్ఐఆర్ ప్రక్రియపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించడం రాజకీయ పార్టీలు, ప్రజాప్రతినిధులు, సామాజిక సంస్థలు, కార్యకర్తలందరి బాధ్యత అని షబ్బీర్ అలీ అన్నారు. గ్రామాలు, వార్డులు, కాలనీల స్థాయిలో ఇంటింటికీ వెళ్లి ప్రజలకు అవగాహన కల్పించి, ఒక్క అర్హ ఓటరు కూడా నమోదు కాకుండా మిగిలిపోకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. చివరగా ప్రతి అర్హ ఓటరు తన ఓటు హక్కును పరిరక్షించుకోవాలి. ఎస్ఐఆర్ ప్రక్రియలో చురుకుగా పాల్గొని ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలని మహమ్మద్ అలీ షబ్బీర్ ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మేయర్ ఉమారాణి, డిసిసి అధ్యక్షులు నగేష్ రెడ్డి, నిజామాబాద్ పట్టణ అధ్యక్షులు రామకృష్ణ, మాజీ డిప్యూటీ మేయర్ ఫహీమ్ , పాప, ముజాహిద్ ఖాన్, హారున్ ఖాన్, కరీం, మహమ్మద్ భారీ, రత్నాకర్, మౌలానా లాయిక్, జాఫర్ హుస్సేన్, సబ్జార్, వహీద్, ఆసిఫ్, మీరాన్ అలీ, తదితరులు పాల్గొన్నారు.

