. . . టీఆర్ఎస్ సీనియర్ నాయకులు పోతంగల్ రామ్ కిషన్ రావు
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :
కుల, మత, వర్గ విభేదాలకు అతీతంగా ప్రపంచంలోనే గొప్ప ప్రజాస్వామ్య దేశంగా భారతదేశం నిలిచిందని టీఆర్ఎస్ సీనియర్ నాయకులు పోతంగల్ రామ్ కిషన్ రావు అన్నారు. దేశ సమైక్యత, భారతమాత రక్షణ కోసం ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని ఆయన పిలుపునిచ్చారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని మారుతి నగర్లో ఉన్న స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీకన్స్ట్రక్షన్ ఆధ్వర్యంలో మానసిక దివ్యాంగ విద్యార్థులతో జాతీయ జెండా ర్యాలీ నిర్వహించారు. సొసైటీ ప్రిన్సిపాల్ జ్యోతి, కార్యదర్శి ఎస్. సిద్ధయ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమాన్ని రూరల్ సీఐతో పాటు పోతంగల్ రామ్ కిషన్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా రామ్ కిషన్ రావు మాట్లాడుతూ, దేశభక్తి, జాతీయ భావాలను ప్రతి ఒక్కరిలో పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. వందేమాతరం గీతానికి పార్లమెంటులో ఆమోదం లభించిన రోజు చారిత్రకమైనదని పేర్కొన్నారు. 140 కోట్ల మంది ప్రజలు కుల, మత భేదాలు లేకుండా కలిసి జీవిస్తూ భారతదేశాన్ని ప్రపంచానికి ఆదర్శ ప్రజాస్వామ్య దేశంగా నిలిపారని తెలిపారు. దేశ సరిహద్దుల్లో భారత సైనికులు ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ ప్రాణాలను పణంగా పెట్టి దేశ రక్షణ కోసం సేవలందిస్తున్నారని కొనియాడారు. భారతమాత రక్షణ, దేశ ఐక్యతను కాపాడటం ప్రతి పౌరుడి బాధ్యత అని సూచించారు. అనంతరం విద్యార్థులు నగరంలోని పురవీధుల గుండా జాతీయ జెండాలతో ర్యాలీ నిర్వహించి పలువురు పెద్దలకు జెండాలను అందజేశారు. దేశ సమైక్యత, భారతదేశ గొప్పతనాన్ని తమ ర్యాలీ ద్వారా చాటిచెప్పారు. ఈ కార్యక్రమంలో స్నేహ సొసైటీ ప్రిన్సిపాల్ జ్యోతి, అంధుల పాఠశాల ప్రిన్సిపాల్ రాజేశ్వరి, సొసైటీ సభ్యులు తాటి వీరేశం తదితరులు పాల్గొన్నారు.

