- రాష్ట్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ సంచాలకులు డా.రవీందర్ నాయక్
నిజామాబాద్, బతుకమ్మ : ప్రతీ ఆసుపత్రి డిస్ట్రిక్ట్ రిజిస్ట్రేషన్ అథారిటీ క్రింద రిజిస్ట్రేషన్ చేయాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ సంచాలకులు డా.రవీందర్ నాయక్ ఆదేశించారు. జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ కార్యాలయాన్నిగురవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అన్ని జాతీయ ఆరోగ్య కార్యక్రమాల వారిగా ప్రగతి గురించి ప్రోగ్రాం అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో క్లినికల్ ఎస్టాబ్లిష్ మెంట్ యాక్టు అమలు గురించి ప్రయివేట్ ఆస్పత్రుల రిజిస్ట్రేషన్ గురించి సమీక్షించారు. ప్రతిఒక్క ఆసుపత్రి తప్పకుండా డిస్ట్రిక్ట్ రిజిస్ట్రేషన్ అథారిటీ క్రింద రిజిస్ట్రేషన్ చేయాలి అని తెలిపారు. ఈ విషయంలో జిల్లా యంత్రాంగం ప్రత్యేక శ్రద్ద వహించాలి అని సూచించారు. జిల్లా లో పి.హెచ్.సి. లలో అదనపు గదుల నిర్మాణం కోసం ప్రతిపాదనలు పంపాలని హెచ్ఆర్ సిబ్బంది కొరత గురించి జిల్లా కు కావలసిన అవసరాల గురించి ప్రతిపాదనలు తయారు చేసి పంపాలని ఆదేశించారు. స్కానింగ్ సెంటర్ ల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించి విస్తృత తనిఖీలు చేపట్టాలని ప్రయివేట్ ఆసుపత్రుల రిజిస్ట్రేషన్ పట్ల ప్రత్యేక సెల్ ద్వారా కార్యకలాపాలు నిర్వహించాలని సూచించారు. ఎన్ సి.డి.ప్రోగ్రాం లో బ్లడ్ షుగర్ పరీక్షల గురించి ప్రత్యేక శ్రద్ధ వహించి ఈ పరీక్షలు పెరిగేలా చూడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం అధికారులు, డి.ఎం.హెచ్.ఓ.డా.చంద్ర శేఖర్, డా.శిరీష, డా.అనురాధ, డా.విద్య,డా.ప్రభు దయ కిరణ్,మాస్ మీడియా అధికారి వేణుగోపాల్, హెచ్.ఈ.ఓ.చలపతి, తదితరులు పాల్గొన్నారు.
