. . . ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్ డా. ఎన్. కృష్ణ మోహన్
నిజామాబాద్ సిటి, బతుకమ్మ :
వైద్య విద్య పూర్తి చేసి ప్రజాసేవలో అడుగుపెడుతున్న ఈ దశలో బాధ్యత, క్రమశిక్షణ, వైద్య నైతిక విలువలు పాటించాలని ఇంటర్న్ షిప్ కు ఎంపికైన విద్యార్ధులకు ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్ డా.ఎన్.కృష్ణ మోహన్ సూచించారు. నిజామాబాద్ ప్రభుత్వ మెడికల్ కళాశాల, ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో మంగళవారం 2026-27 సంవత్సరానికి సంబంధించిన నూతన బ్యాచ్ సిఆర్ఎంఐ (కంపల్సరి రోటెటింగ్ మెడికల్ ఇంటర్నిషిప్) ఇంటర్న్ ల కోసం అవగాహన ఓరియంటేషన్ కార్యక్రమం జిజిహెచ్ ఇంచార్జీ సూపరింటేండేంట్ ప్రొ.డా.నాగ మోహన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డా. ఎన్. కృష్ణ మోహన్ ముఖ్య అతిథిగా హాజరై ఇంటర్న్ లను ఉద్దేశించి ప్రసంగించారు. వైద్య విద్య పూర్తి చేసిన వారికి శిక్షణలో ఇంటర్నిషిప్ కీలకమైందని, దానిలో మెలుకువలతో పాటు, నియమ నిబంధనలు అలవర్చుకోవాలని కోరారు. వైద్యుడు, రోగి మద్య ఉండాల్సిన సంబంధాలను ఈ శిక్షణలో నేర్చుకోవాలని సూచించారు. ఆసుపత్రి ఇన్చార్జి సూపరింటెండెంట్ డా.బి.వి.నాగ మోహన్ నూతన ఇంటర్న్ లకు స్వాగతం పలుకుతూ… రోగుల పట్ల సేవాభావంతో వ్యవహరించాలని ఆసుపత్రి నిబంధనలు విధులు, వైద్య నైతికతను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సూపరింటెండెంట్లు డా.శ్రీకాంత్, డా.రవికిరణ్, డా.రాజశేఖర్, కళాశాల వైస్ ప్రిన్సిపాళ్లు డా.కె.జె.కిషోర్ కుమార్, డా. జె. తిరుపతి రావు, డా.విజయ్ కుమార్, డా.అరుణ రేఖ, డా.సలీం, డా.రమణ, డా.ఇమ్రాన్, డా.శివకృష్ణ తమ తమ విభాగాలలో ఇంటర్న్ ల విధులు, బాధ్యతలు, రోగుల సంరక్షణ విధానం, అత్యవసర సేవలు, మెడికో-లీగల్ అంశాలు, వైద్య నైతిక విలువలు ఆసుపత్రి సేవా ప్రమాణాలపై సమగ్ర అవగాహన కల్పించారు. ఈ ఓరియంటేషన్ కార్యక్రమం ఇంటర్న్ లకు వారి విధులపై స్పష్టమైన అవగాహన కల్పించి బాధ్యతాయుతమైన వైద్యులుగా తీర్చిదిద్దేందుకు ఉపయోగపడుతుందని నిర్వాహకులు తెలిపారు.
