. . . కామారెడ్డి నియోజకవర్గంలో ఏకతాటిపైకి కాంగ్రెస్ శ్రేణులు
. . . జిల్లా అభ్యర్థులకు బీ-ఫామ్లు అందజేసిన మహేష్ కుమార్ గౌడ్
కామారెడ్డి, బతుకమ్మ :
కామారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి గ్రూపు రాజకీయాలు లేవు. అందరం కలిసికట్టుగా ప్రజాక్షేత్రంలోకి వెళ్తాం” అని పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ స్పష్టం చేశారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కామారెడ్డి జిల్లా అభ్యర్థులకు కాంగ్రెస్ పార్టీ బీ-ఫామ్ల పంపిణీ కార్యక్రమం సోమవారం అత్యంత ఉత్సాహంగా జరిగింది. కామారెడ్డి నియోజకవర్గంలో పార్టీ కేడర్ మధ్య పూర్తి సమన్వయం ఉందని, వర్గ పోరుకు తావులేకుండా అందరూ ఏకతాటిపైకి రావడం శుభపరిణామమని నేతలు పేర్కొన్నారు. ఈ మున్సిపల్ ఎన్నికల్లో ‘సమన్వయమే మంత్రం’గా ముందుకు సాగి అన్ని వార్డుల్లో జయకేతనం ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. మహేష్ కుమార్ గౌడ్, షబ్బీర్ అలీ, జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ షట్కర్, మున్సిపల్ ఎన్నికల ఇంచార్జ్ మహమ్మద్ అజారుద్దీన్, డీసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ కి మున్సిపల్ ఎన్నికల అభ్యర్థుల బీ-ఫామ్లు అందజేశారు. జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలను క్లీన్ స్వీప్ చేయడమే లక్ష్యంగా కార్యకర్తలు, నాయకులు విభేదాలు పక్కన పెట్టి పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం అహర్నిశలు శ్రమించాలని, రెబల్ అభ్యర్థులు లేకుండా చూసుకొని ముందుకు వెళ్లాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ జనరల్ సెక్రెటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి తో పాటు ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
