. . . నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
మత్తు పదార్థాల వినియోగం విద్యార్థుల ఆరోగ్యం, భవిష్యత్తును దెబ్బతీస్తుందని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య అన్నారు. జిల్లా ప్రభుత్వ మెడికల్ కళాశాల యాంటీ ర్యాగింగ్, మత్తు పదార్థాల నివారణ, సైబర్ క్రైమ్ పై గురువారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీపీ హాజరై విద్యార్థులకు చట్టపరమైన అవగాహనతో పాటు, సమాజంలో బాధ్యతాయుత పౌరులుగా ఉండాల్సిన అవసరాన్ని వివరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ర్యాగింగ్ ఒక తీవ్రమైన నేరమని, దానికి కఠినమైన శిక్షలు ఉంటాయని హెచ్చరించారు. అలాగే సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని, సోషల్ మీడియా వినియోగంలో జాగ్రత్తలు పాటించాలని సూచించారు. డ్రగ్స్ కు సంబంధించినటువంటి సమాచారము ఎవరికి తెలిసిన 1908 టోల్ ఫ్రీ నెంబర్ కు కాల్ చేయాలని తెలిపారు. అనంతరం కళాశాల ప్రిన్సిపల్ డా.క్రిష్ణ మోహన్, సూపరింటెండెంట్ డా.నాగమోహన్ మాట్లాడుతూ కళాశాలలో ర్యాగింగ్కు జీరో టాలరెన్స్ విధానం అమలు చేస్తున్నామని, విద్యార్థుల భద్రతకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నిపుణులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ ద్వారా ర్యాగింగ్, డ్రగ్ అబ్యూస్, సైబర్ క్రైమ్లపై సమగ్ర అవగాహన కల్పించారు. అనంతరం ర్యాగింగ్కు వ్యతిరేకంగా, మత్తు పదార్థాలకు దూరంగా ఉండటం, సైబర్ భద్రత పాటించడం పై ప్రతిజ్ఞ చేశారు. డ్రగ్స్ సంబంధించిన కరపత్రములు, పోస్టర్స్ విడుదల చేశారు.

ఈ కార్యక్రమంలో నిజామాబాద్ ఏసీపీ బి.ప్రకాష్, ఈగిల్ సెల్ ఆర్ఎన్సీసీ డీఎస్పీ ఎం. సోమనాథం, సైబర్ క్రైమ్ ఏసీపీ వెంకటేశ్వరరావు, ఆరెట్టి నారాయణ (అడ్వొకేట్), డా.జలగం తిరుపతి రావు, డా.కిషోర్, వన్ టౌన్ ఎస్.హెచ్.ఓ రఘుపతి, అధ్యాపకులు నాగరాజు, అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.



