- కల్తీమందు కొడితే మినుము పంట ఎండిపోయింది
- ఎదుగుదల కోసమని రసాయానిక మందుకొడితే
- ఎకరాలలో పంట ఎండిపోయింది
- హంగర్గలో రైతుల లబోదిబో
బోధన్, బతుకమ్మ : వ్యవసాయ అధికారులు సీజన్ లో జరుగుతున్న పురుగుల మందులు, విత్తనాలు, ఎరువుల విక్రయాలపై నజర్ వేయకపోవడంతో రైతులు నష్టపోతున్నారు. పొరుగున మహారాష్ట్ర ఉండడం, ఇతర ప్రాంతాల నుంచి నకిలీ మందులను తీసుకువచ్చి రైతులకు అంటగడుతున్నారు. వ్యవసాయాధికారులు సలహాలు ఇచ్చే వారు క్షేత్రస్థాయిలో లేకపోవడంతో రైతులు నేరుగా ప్రెస్టిసైడ్ దుకాణాలు కొనుగోలు చేసింది.

మందులు వాడి నష్టపోతున్నారు. నిజామాబాద్ జిల్లా బోధన్ సబ్ డివిజన్ లోని కొన్ని గ్రామాల్లో ఈ సీజన్ లో ఇలాంటి ఘటనలు వెలుగు చూస్తున్నాయి. బోధన్ మండలం హంగర్గ గ్రామంలో సంజీవ్ అనే రైతు మినుము పంట ఎదుగుదల కోసం గ్రీన్స్ బోరో అనే రసాయానిక ఎరువులను చల్లాడు. స్థానికంగా రెంజల్ మండలం నీలాకు చెందిన ఆమెర్ ట్రేడర్ లో కొనుగోలు చేసిన రసాయానిక మందులను ఎకరాకు 5 డబ్బాలను స్ర్పే చేశారు.

దాంతో పంట ఎదుగుదల అటుంచి మినుము పూతదశలోనే ఎండిపోయింది. దానితో రైతు సంబంధిత దుకాణం యజమానిని అడిగితే మాకు సంబంధం లేదని తొలుత బుకాయించాడు. సంజీవ్ పొలం ప్రక్కనే ఉన్న మరో వ్యక్తికి సంబంధించిన పంటకు అదే మందును స్ర్పే చేయడంతో అది కూడా ఎండిపోయింది. దాంతో రైతుల పర్టిలైజర్ దుకాణ నిర్వాహకులపై మండిపడ్డారు. కాళ్ళబేరానికి వచ్చిన వ్యాపారి రైతుకు పంట నష్టం కింద రూ.17,500 ఇస్తానని ముందుకు వచ్చాడు. అయితే రైతుకు పంట సాగు కోసం చేసిన పెట్టుబడి ఏ మూలకు సరిపోదని ఒకవేళ పంట చేతికొస్తే రూ.65000 లాభం వచ్చేదని తమకు జరిగిన నష్టాన్ని గుర్తించి పరిహారం ఇవ్వాలని కోరినా స్పందించలేదు. ఇదే విషయంపై మండల వ్యవసాయాధికారులకు ఫిర్యాదు చేస్తామని రైతు సంజీవ్ తెలిపారు. ఈ విషయంపై మండల ఏఈవోను వివరణ కోరేందుకు యత్నించగా ఆయన స్పందించలేదు.

