. . . ఆర్ ఎస్ పి జిల్లా కన్వినర్ కఠారి రాములు
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :
గత ప్రభుత్వ హయాంలో నిజామాబాద్ జిల్లా కేంద్రంలో పేదల కోసం నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇప్పటికీ పేదలకు కేటాయించకుండా నిర్లక్ష్యానికి గురవుతున్నాయని వాటిని వెంటనే పేదలకు పంచిపెట్టాలని ఆర్ ఎస్ పి జిల్లా కన్వినర్ కఠారి రాములు డిమాండ్ చేశారు. మంగళవారం రివల్యూషనరీ సోషలిస్టు పార్టీ జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశంలో నిజామాబాద్ జిల్లా కన్వీనర్ కటారి రాములు మాట్లాడుతూ.. . కోట్ల రూపాయల ప్రజాధనంతో నిర్మించిన ఈ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ప్రస్తుతం నిరుపయోగంగా మారి శిథిలావస్థకు చేరుతున్నాయని, సరైన సంరక్షణ లేకపోవడంతో భవనాల పరిస్థితి రోజురోజుకు దిగజారుతుందని తెలిపారు. ఇప్పటికే అనేక ఇండ్లలో తలుపులు, కిటికీలు, విద్యుత్ సామగ్రి దొంగతనాలకు గురవుతున్నాయని, దీనివల్ల ప్రభుత్వ ఆస్తి భారీ నష్టం జరుగుతుందని అన్నారు.ఈ ఇండ్లు ప్రస్తుతం తాగుబోతులకు, అసాంఘిక శక్తులకు అడ్డాగా మారుతున్నాయని, చుట్టుపక్కల నివసిస్తున్న ప్రజలు భద్రతా సమస్యగా పరిణమిస్తున్నాయి విమర్శించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ పరిస్థితిని సమీక్షించకపోతే సామాజిక సమస్యలు మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ప్రస్తుత ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకొని, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మరమ్మత్తులు చేయించి, అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించి అర్హులైన నిరుపేదలకు వెంటనే కేటాయించాలని కటారి రాములు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో, ప్రజల సమస్యలపై నిర్లక్ష్యం కొనసాగితే, వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ప్రజలతో కలిసి ఉద్యమాలు చేపట్టి ఈ ఇండ్లు పేద ప్రజలకు పంచే కార్యక్రమాలు చేపడతామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అబ్దుల్ ముజీబ్,రఫీ ఉద్దీన్, మోహన్ సింగ్, టి గోపాల్, కమల్ తదితరులు పాల్గొన్నారు
