. . . నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
పండుగ రోజుల్లో ఎలాంటి అపోహలు, వదంతులు వ్యాప్తి చెందకుండా అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా సోషల్ మీడియా ద్వారా వచ్చే అసత్య ప్రచారాలను నమ్మవద్దని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య అన్నారు. బక్రీద్ పండుగను శాంతియుతంగా, సామరస్య వాతావరణంలో నిర్వహించేందుకు పోలీస్ కార్యాలయం లోని కమాండ్ కంట్రోల్ హల్ లో సీపీ ఆధ్వర్యంలో సోమవారం ముస్లిం మత పెద్దలు, మసీదు కమిటీ సభ్యులతో కీలక సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పండుగ సందర్భంగా తీసుకోవాల్సిన భద్రతా చర్యలు, ప్రజల సహకారం, శాంతి భద్రతల పరిరక్షణపై విస్తృతంగా చర్చించారు. ఈ సందర్బంగా సీపీ మాట్లాడుతూ బక్రీద్ వంటి ముఖ్యమైన పండుగలను పరస్పర గౌరవంతో జరుపుకోవడం సమాజంలో ఐక్యతకు ప్రతీక అని పేర్కొన్నారు. అనుమానాస్పద సమాచారం గమనించిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్కు లేదా అధికారులకు తెలియజేయాలని కోరారు. ప్రార్థనా స్థలాల వద్ద ప్రత్యేక పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. ముఖ్య ప్రాంతాల్లో సీసీ కెమెరాల ద్వారా నిరంతర నిఘా కొనసాగించడంతో పాటు, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ప్రత్యేక చర్యలు చేపడతామని చెప్పారు. పండుగ రోజుల్లో ప్రజలు ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ముస్లిం మత పెద్దలు పోలీస్ శాఖ చర్యలను అభినందిస్తూ, శాంతి భద్రతలను కాపాడేందుకు తమ వంతు సహకారం అందిస్తామని తెలిపారు. పండుగను ప్రశాంత వాతావరణంలో జరుపుకునేలా ప్రజలకు అవగాహన కల్పిస్తామని హామీ ఇచ్చారు. సమావేశంలో ఇతర పోలీస్ అధికారులు కూడా పాల్గొని తమ తమ సూచనలు వెల్లడించారు. జిల్లాలో శాంతి, సామరస్య వాతావరణం కొనసాగేందుకు పోలీస్ శాఖ, ప్రజలు పరస్పర సహకారంతో ముందుకు సాగాలని కమిషనర్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ ఎ.సి.పి ఏ.ప్రకాష్, ట్రాఫిక్ ఏ.సి.పి మస్తాన్ అలీ, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్ పెక్టర్ శ్రీధర్ రెడ్డి, టౌన్ సి.ఐ శ్రీనివాస్ రాజ్, టౌన్ 1 ఎస్.హెచ్.ఓ రఘుపతి, రూరల్ సి.ఐ లు శ్రీనివాస్, సతీష్ కుమార్, ధర్పల్లి సి.ఐ భిక్షపతి, ఎస్.ఐ లు, ముస్లిం మత పెద్దలు ఖురేషిలు, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.
