ఆదిలాబాద్, బతుకమ్మ :
ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలోని కన్గుట్ట గ్రామంలో ప్రమాదవశాత్తూ అగ్నిప్రమాదానికి గురై దగ్ధమైన మొక్కజొన్న, జొన్న పంటలను తెలంగాణ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి సోమవారం పరిశీలించారు. బాధిత రైతులతో మాట్లాడి ప్రమాద వివరాలు, పంట నష్టం గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ ప్రమాదంలో 48 ఎకరాల్లో మొక్కజొన్న, జొన్న పంటలు పూర్తిగా దగ్ధమవడం జరిగిందని వారు తెలిపారు. స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యటించిన అన్వేష్ రెడ్డి పంట నష్టపోయిన రైతులను పరామర్శించారు. కళ్లముందే చేతికొచ్చిన పంట బూడిదైపోవడంతో రోదిస్తున్న రైతులను చూసి ఆయన చలించిపోయారు. పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకునేలా, తగిన నష్టపరిహారం అందించేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
