- అస్తవ్యస్తంగా రోడ్లు..
- ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని ప్రయాణిస్తున్న వాహనదారులు
రుద్రూర్, బతుకమ్మ : రోడ్డు ప్రమాదాలను అరికట్టడం ప్రతి ఒక్కరి బాధ్యతని, మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల ఆక్సిడెంట్లు అవుతాయని పోలీస్ శాఖ అధికారులు నిత్యం చెబుతూ ఉంటారు. కానీ రోడ్లు బాగా లేకపోతే కూడా ప్రమాదాలు జరుగుతాయన్న విషయం ఆర్ అండ్ బి అధికారులు మర్చిపోతున్నారు. అయితే ప్రమాదం జరిగితే గాని పట్టించుకోరా?.. అంటే అవునన్నట్లుగానే ఉంది. ఈ అధికారుల తీరు. వివరాల్లోకి వెలితే రుద్రూర్ మండలం అంబం (ఆర్) గ్రామానికి చెందిన రహదారి అస్తవ్యస్తంగా మారింది. వాహనదారులు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని నరకయాతంగా ప్రయాణం కొనసాగిస్తున్నారు. ఈ రోడ్డు దుస్థితి గురించి అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. వాహనదారులకు అడుగడుగునా ఓ గుంత దర్శనమిస్తోంది. ప్రజలు ఇంత ఇబ్బంది పడుతున్నా అధికారులు, పాలకుల్లో కొంచెం కూడా చలనం లేదని స్థానికులు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇప్పటికైనా మండల ఉన్నతాధికారులు, పాలకులు స్పందించి క్షేత్రస్థాయిలో పరిశీలించి రహదారులను బాగు చేసి వాహనదారుల సమస్యలను తీర్చాలని ప్రజలు కోరుతున్నారు.
